పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

27

   ద్గమకౢప్తా౽సమయోపరాగమతికక్ష్మాస్నానగంగానది
   భ్రమకృత్కీర్తిక కల్కిమూర్తికపరబ్రహ్మన్ స్తుమస్త్వామనున్.

విద్వజ్జనకోలాహలుఁడు


ఈతఁడు గొప్పసంస్కృతపండితుఁడు. తెలుఁగుకవన మల్లుటయందుఁ బ్రజ్ఞగలవాఁడు. అనర్గళమగు వాచాలత గలవాఁడు. ఈతనిపేరన్నఁ గవులకు గుండెదిగులు. ఈపండితునకు గుదియలకామి యను నొక యుంపుడుకత్తె కలదు. తాను దిగ్విజయమునకు బయలువెడలునప్పు డావెలఁదినిఁ గూడఁదోకొని పోయెడివాఁడు. తనకు సంస్కృతాంధ్రపాండిత్యమునకు సమ్మానము; దానికో గానాభినయపాండిత్యమునకు సమ్మానము. ఇట్లు వారిరువురును సంస్థానములఁ దిరుగుచుఁ దిరుగుచుఁ గృష్ణదేవరాయల సంస్థానమునకు వచ్చిరి. కోలాహలుని రాక విని యాంధ్రకవితాపితామహుఁడు “వీని జయించుటెట్లు?” అని యోచింపఁ దొడఁగెను. మన తెనాలిరామకృష్ణకవి పెద్దనకు ధైర్యముఁ జెప్పెను. నాఁటిసాయంతనపుసభకు వా రిరువురును వచ్చిరి. పండితులందఱుఁ గూర్చుండియుండిరి. పెద్దనగా రటునిటు పచారు సేయుచుండిరి. కోలాహలపండితుఁ డాసభాముఖమున నిలిచియే

చ. “వదలక మ్రోయు నాంధ్రకవివామపదంబున నున్ననూపురం
   బుదితమరాళకంఠనినదోక్తుల నేమని పల్కుఁ బల్కుఁడీ

అని సమస్య నొసంగఁ దత్క్షణమే రామకృష్ణకవి లేచి