Jump to content

పుట:Chandrika-Parinayamu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. అలగోత్రాపతిపుత్రి యిట్లు గిరికన్యాముఖ్యదిగ్దేశరా
ణ్ణలినాస్యాజనతాసమర్పితమహానానామణీభూషణా
వళిశృంగారితగాత్రియై ద్విజసతీవారంబు దీవింపఁ దొ
య్యలు లారాత్రికముల్ ఘటింప నవమోదారూఢి మించెం గడున్. 30

తే. అంతకయ మున్ను బంధువయస్యదండ
నాథముఖ్యులు తత్సుచంద్రక్షితీంద్రుఁ
బెండ్లికొడుకు నొనర్ప దర్పించువేడ్కఁ
గడఁగి శుభలీల నాళిసంఘములఁ బనుప. 31

చ. తరుణులు చేరి కాంచనవితర్దిక శోభనపీఠిఁ బెట్టి భూ
వరు వసియింపఁ జేసి ద్విజవారిజలోచన లెల్లఁ గోకిల
స్వరమునఁ బాట పాడ ననివారితమంగళవాద్యనిస్వనో
త్కరములు చాల బోరుకొన గ్రక్కున నారతు లెత్తి రయ్యెడన్. 32

సీ. అఱచందమామపై కుఱుకుచీఁకటిపిల్ల
లన ఫాలతటిఁ గుంతలాళిజాఱ,
మదిపేరిమరుమేడఁ బొదలుధూపము పర్వు
పోల్కిఁ గ్రొందావియూర్పులు జనింప,
నన నూఁగువేడ్కఁ జేకొని మ్రోయు తేఁటిచాల్
సరి నీలవలయముల్ చాల మొఱయ,
లవలియాకులఁ గ్రమ్మునవహైమకణముల
గతిఁ జెక్కుల శ్రమాంబుకణిక లుబ్బ,

తే. సరులు నటియింప, నునుఁగౌను సంచలింప
గుబ్బకవ రాయిడింప, సకు ల్నుతింప,
చూపునెఱమించు మించుమేల్సొగసు నింప
నమ్మహీపాలు శిర సంటెఁగొమ్మయొకతె. 33