పుట:Bhagira Loya.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

రైళ్లను గురించి, విమానాలను గురించి, సినీమాలను గురించి, విద్యుచ్ఛక్తిదీపాలను గురించి, దేశాలు, దేశాలలోని ప్రజలు, పంటలు, నగలు, దుస్తులు మొదలైనవాటిని గురించి నోరూరేట్లు చెబుతూఉంటే విస్తుపోయి వింటూఉండేది.

మీనాక్షి సీతారామయ్యగారింట్లోనే భోజనం చేసేది. ఆయన తనకోసం అని ఇచ్చిన వీధిగదిలో సామాను పెట్టుకుని అక్కడనే పడుకునేది. కామేశ్వర్రావు స్నేహముచేత శుభ్రత, శుచి, రసజ్ఞత వీటినిగురించి మీనాక్షి బాగా నేర్చుకొన్నది. ఎరకలవాళ్ల పందులదొడ్డిలా వుండే మీనాక్షిగది నెమ్మది నెమ్మదిగా మార్పుచెంది ఆరునెలలలో కళాప్రదర్శనపు మందిరములా తయారైనది. మోడరన్‌రివ్యూ, భారతి, గృహలక్ష్మి మొదలైన పత్రికల్లోంచి కామేశ్వర్రావు సంగ్రహించిన బొమ్మలు అద్దాలు కట్టించి గోడలమీద వేలాడ గట్టుకుంది. రెండు మూడు జపాన్ వెదురు అల్లిక తెరలు కూడా గోడలకు తగిలించింది.

ఇంతలో సీతారామయ్యగారి పెద్దకూతురు పుట్టింటికి పండక్కని చక్కా వచ్చించి. ఆ అమ్మాయి అత్తవారు కాకినాడ. అత్తవారు మంచి నాగరికతగల కుటుంబమగుటచేత ఆమె అతి నవీన నాగరికతా సంప్రదాయంలో ప్రథమ తరగతిలో ప్రథమముగా వుంటూన్నవాళ్లలో ఒక్కత్తె. మన దేశంలో భర్తకి ఎట్లా యిష్టం అయితే అలాగ మారి పోతారుగా ఆడవాళ్ళు. ఆవిడకు సీతారామయ్యగారు పెట్టిన పేరు వియ్యమ్మ. నేడు విజయానందని.

69