పుట:Andhra bhasha charitramu part 1.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచ్ఛిక ప్రకరణము.

బ్రిటిష్‌ఇండియాకు వాయవ్యదిశను హిందూకుష్‌పర్వతములచే మూడు దిక్కుల చుట్టుకొనబడిన ప్రదేశము నాక్రమించి యున్నవి.

పైశాచీభాషల యీ యాదిమప్రదేశము ప్రాకృతలాక్షణికుల యభిప్రాయమున కనుగుణముగనే యున్నది. మార్కండేయుడు (17-వ శతాబ్దము) కాంచీదేశీయ, పాండ్య, పాంచాల, గౌడ, మగధ, వ్రాచడ, దాక్షిణాత్య, శౌరసేన, కేకయ (కైకయ), శబర, ద్రావిడ, దేశములందు పైశాచీ భాషలు మాట్లాడబడుచుండెనని తెలుపుచు నందు కైకేయ, శౌరసేన, పాంచాలదేశములందలి పైశాచీభాషలు నాగరములని, అనగా ప్రామాణికము లని చెప్పియున్నాడు. రామతర్కవాగీశుడు (17-వ శతాబ్దము) పైశాచీభాష కైకయ, ఛస్క (?) భేదములచే రెండువిధములుగ నున్నదనియు, మాగధ్యాది ప్రధానప్రాకృతముల యుచ్చారణము మాఱుటవలన అశుద్ధపైశాచికభాష లేర్పడుననియు దెలిపియున్నాడు. లక్ష్మీధరు డీపైశాచీభాషలకు పాండ్య, కేకయ, బాహ్లిక, సింహ(ళ?), నేపాళ, కుంతల, సుధేష్ణ, బోట, గాంధార, హైవ, కన్నోజనదేశములు స్థానములుగ జెప్పియున్నాడు.

పై పిశాచదేశములపట్టికలను బట్టి యొకపటము నేర్పాటుచేసికొనినచో వారు భారతవర్షమున వ్యాపించిన మార్గము తేటపడగలదు. అట్టిపటము వలన పిశాచజనులు రెండుమార్గములనుబట్టి యీదేశమున వ్యాపించిరని తెలిసికొనగలము. సౌకర్యముకొఱకు కేకయ, బాహ్లికులు ప్రధాన పిశాచజను లగుటచే నొకటి కేకయ మార్గమనియు, నొకటి బాహ్లికమార్గమనియు నందము. కేకయులు హిమవత్పర్వతపాదభూముల ననుసరించి సుధేష్ణ, హైమ, నేపాలమార్గమున బోట దేశమువఱకు వ్యాపించిరి. అచ్చట గొప్పపర్వతము లడ్డురాగా దక్షిణమునకు దిగి మగధదేశము నాక్రమించుకొనిరి. అచ్చటనుండి యొకశాఖ గౌడదేశమునకు బోయెను. మఱియొకశాఖవారు పశ్చిమమునకు దారితీసి వింధ్యపర్వతములను జేరికొనిరి. ఈ వింధ్యపర్వత పరిసరప్రదేశములే యైతరేయ బ్రాహ్మణ కాలమునాటి యాంద్రారి పిశాచజనుల కాటపట్టయి యుండెను. ఈ యాంధ్రశాఖ పశ్చిమమున నాసికవఱకును దక్షిణమున గుంతలమువఱకును వ్యాపించెను. ఇట్లుండగా బాహ్లికులును బశ్చిమతీరమున దక్షిణమార్గ మనుసరించి ఛస్క, వ్రాచడ, శౌరసేనమార్గమున నాసికవఱకును వ్యాపించిరి. ఇచట కేకయ శాఖయగు నాంధ్రులకును బాహ్లికశాఖకును సంబంధము మఱల గలిగెను. ఇచ్చటనుండి యీ పిశాచజనులు దక్షిణముగ నన్నిదిక్కులకును వ్యాపించిరి. అందు గొందఱు కన్నోజనమార్గమున గుంతలదేశము నాక్రమించిరి. కొందఱు తూర్పుతీరమువఱకు వ్యాపించి కాంచీదేశము నుండి దక్షిణముగ తూర్పుసముద్రతీరము ననుసరించి వ్యాపించిరి. వీరే కాంచీ,