పుట:AndhraRachaitaluVol1.djvu/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామయ్యపంతులుగారు, వీరేశలింగముపంతులుగారు నొక్క శ్రేణికి జెందినవారు.

వీరభద్రరావుగారు చదివినది ' స్కూలు ఫైనలు ' వరకే యనుకొందుము. అయిననేమి ? వారు చరిత్రచతురాననులు. పదవుల కొరకు బ్రాకులాడక యాంధ్రచరిత్ర పరిశోధనమునకు దమయావజ్జీవనము ధారవోసి తరించిన యిట్టిమహాపురుషుడు చిరస్మరణీయుడు.

వీరభద్రరావుపంతులుగారి ' ఆంధ్రులచరిత్ర ' యే తెలుగువారిలో జాతీయావేశము రగుల్కొల్పినది. భావిచరిత్రనిర్మాతల కాంధ్రుల చరిత్ర మొకపెన్నిధి. చిలుకూరివారి చరిత్రపరిశోధనరంగములో బ్రాచీనాంధ్రసౌభాగ్యము ప్రాచినసామ్రాజ్య విభవము తెరను దెరచుకొన్ వచ్చి మధురనాట్యము చేసినది.

ఆయన భౌతికదేహ మింక మనకు గానరాదు. ఆంధ్రుల చరిత్రము మాత్రమే యాంధ్రదేశమందెచ్చట జూచినను గనవచ్చును. నేడు పరిశోధకులలో బేరందుచున్న శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు వీరభద్రరావుగారిత్రోవ నభినందింతురు. శ్రీ కుందూరి ఈశ్వరదత్తు బి.ఏ. గారు వీరి మేనల్లురు. వీరేశలింగము పంతులుగారి తరువాత నాంధ్ర చరిత్రకారులకు వీరభద్రరావుగా రాదర్శకులని యాంధ్రు లైకకంఠ్యముగా నంగీకరింపవలసినదే.

రాజమహేంద్రవరమున గల ఆంధ్రచరిత్రపరిశోధకసభా ప్రతిష్ఠాపకులలో శ్రీ వీరభద్రరావుగా రొకరు. ఇట్టి పంతులుగారికి 1928 లో నంద్యాలయందు సర్వేపల్లి రాధాకృష్ణుని యాజమాన్యమున జరిగిన ' ఆంధ్రమహాసభ ' లో ' ఆంధ్రచరిత్రచతురానన ' యను బిరుద మిచ్చి సత్కరించిరి.