పుట:AndhraRachaitaluVol1.djvu/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"భాషను జెఱుచుట తప్పు. అశ్లీలము లుంట తప్పు. దుర్నీతికరములుగ నుంట తప్పు. బండుబూతుమాటల నీతిజెప్పుట తప్పు. పేరుపెట్టి దూషించి యెత్తివేయుట తప్పు. గ్రంథమునం దిత్యాదులు తప్పు లగునుగాని మిగతవి తప్పులు గావు. విషయవైశద్యము కొంతవరకు నుండిన జాలు. లోహములన్నియును స్వర్ణమయములు కాకపోయినను బనికిమాలినవి యెవ్వియును గావు. పూర్వకాలమునుండియు బుద్ధికుశలులని పెరందిన పండితుల గ్రంథములు చదివి తమ బుద్ధి బలిమిని వానికి జేర్చి యిప్పటివారు వ్రాయు గ్రంథములు చెడెనని చెప్పుట యసమంసంబు."

శ్రీనివాసరావుగారు మల్లినాధసూరి వంశీయులు. వీరి పూర్వజు లందరును విజయనగర సంస్థాన పండితులు. వీరు నాటకాంత సాహిత్యము నెఱిగి స్వాధ్యాయపాఠము చేసిరి. జ్యోతిషము తెలిసికొనిరి. 1876 లో ఎఫ్.ఏ. పరీక్షలో నెగ్గిరి. రెవెన్యూ డిపార్టుమెంటులో బనిచేసి 1881 లో అనంతపుర మండలము "డిప్యూటి కలక్టరు" కడ దివానుగా నుద్యోగించిరి. 1888 లో రెండవతరగతి ప్లీడరు పరీక్షలో దేలి బళ్ళారిని న్యాయవాదులైరి. అంతటినుండి వీరి సారస్వతసేవ యభ్యుదయ మార్గమున బడినది. 1917 లో కడపయందు జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్సభ శ్రీనివాసరావు గారి నధ్యక్షులుగా నాదరించినది. మండపాట పార్వతీశ్వర శాస్త్రి ప్రభృతులు వీరి కవిత్వమును గొండాడిరి.

శ్రీనివాసరావుగా రుదారభావులు. పండితులను సత్కరించిరి. కవులను సన్మానించిరి. పేదలను బోషించిరి. తెలుగునాట నాటక శబ్ద మున్నంతదాక శ్రీనివాసరావుగారి పేరు నిలబడుననుట నిశ్చయము. "ప్రతాపాక్బరీయము" లోని యొక పద్యము మచ్చు.

మూరెడు మీసలన్బెనిచి ముప్పిరిగాబలుమారుదువ్వుచున్
నేరువుమీఱ దుస్తులను నీటుగ గట్టుచు వాలుబట్టుచున్
ధీరులమంచు నోటికసిదీఱగ బ్రల్లదమాడునట్టి యీ
భీరుల బోల కీవు రణభీకరవైతివి తక్కె గీర్తియున్.