“మీరు రతీదేవి.”
“నేను రతీదేవినా!”ఆమె మోము వైవర్ణ్యమొందినది. ఇటు నటు చూచింది. “నేనా రతీదేవిని? బుద్దుని ఓడించి నాశనం చేయడానికి ప్రయత్నించిన మారరాక్షసుని భార్య రతీదేవినా నేను!” ఆమె దీనవదనము చుట్టూ ఉన్న బాలబాలికల హృదయాలను క్రుంగ చేసింది.
బ్రహ్మదత్తుడు మహోత్తమ ప్రేమ స్పందించు మాటలతో “భర్తృ దారికా! నువ్వు మారభావాన్నీ, మన్మథభావాన్నీ విపరీతంగా అర్థం చేసుకొంటున్నావు” అన్నాడు.
“నాకు ఆ రెండు భావాలకూ భేదము కనబడదు ప్రభూ!”
“మారభావము దురాశ అతికాంక్ష, అతిప్రాపంచిక వాసనను తెలియజేస్తుంది. మన్మథభావం నిత్యసృష్టీ, యౌవనమూ, ఆనందమూ.”
“నిత్యసృష్టి మాత్రం దురాశకాదా?”
“ఆధ్యాత్మిక దృష్టినే కావచ్చును. ప్రపంచంలో ఉన్న శుద్దోదనునకూ, మాయాదేవికీ సిద్దార్ధబోధిసత్వుడుద్బవించి జగత్తును తరింపచేసే మార్గ ముపదేశించాడు. మన్మథభావం లేకపోతే అది ఎట్లా సాధ్యం?”
“ఆ మన్మథభావం పూర్తిగా పోవాలనికదా సమంతభద్రుని ఉపదేశం.”
“అవునుకాని ఆ పరమశ్రమణకుడు గృహస్థులు కూడా బౌద్దదీక్ష పుచ్చుకోవచ్చునని అనుమతించిన కారణం ఆలోచించుకొన్నావా రాకుమారీ.”
ఈ సంభాషణ అంతా ఆశ్చర్యపడుతూ ఆ యువతీ యువకులంతా వింటున్నారు. ఉత్సవస్థలంలో యువతీయువకులూ, వసంతుడూ, వనలక్ష్మి రతీ మన్మథులకోసం ఎదురు చూస్తున్నారు. ఆలశ్యం అయిందేమో అని వసంతుడైన వీరపురుషత్తుడు భట్టిదేవి చేయిపట్టుకొని లేచాడు. వసంత వేదికనుండి దిగి, యువతీ యువకులు కొలిచిరా వనరమా వసంతు లిరువురు రతీమన్మథులున్న స్థలానికి వచ్చారు.
"ఏదమ్మ జగదేక సుందరాకార రతి?
ఏదమ్మ ప్రణయయోగాసనావిర్చూత?
ఏది మాదేవి రతి?
ఏదమ్మ ఏది?”
అని బాలికలు పాడినారు. వీరపురుషదత్తుడు, బ్రహ్మదత్తప్రభువు తన చెల్లెలిని రతిగా ఎన్నుకొన్న పరమార్దము వెంటనే గ్రహించాడు. మహారాజు కొమరి తమ మహారాజు ఆజ్ఞలేక రతిగా ఎన్నుకొనడానికి ధైర్యమెవ్వరికి ఉంటుంది, బ్రహ్మాదత్తునకు తప్పితే? యువకుడై, బ్రహ్మచారియైన బ్రహ్మదత్త ప్రభువును చెల్లికి గురువుగా నియమించడంలోని అర్థం వీరపురుషదత్తుడప్పుడే గ్రహించాడు.
వసంతుడు: మీనకేతనదేవా! రతీదేవి రావడానికి ఆలస్యం చేయడం కారణం?
మన్మథుడు: వసంతదేవా! అతనుడై మన్మథుడు మళ్ళీ తనువు తాల్చి వచ్చినాడని రతీదేవి గ్రహించలేకుండా ఉన్నది.
అడివి బాపిరాజు రచనలు - 6
50
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)