పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏవరెవరికి ఎప్పుడు ఆలోచన కావలసినా రాజ కుటుంబాల స్త్రీలు కుసుమలతాదేవి కడకు రావలసిందే! యజ్ఞశ్రీ సార్వభౌముడే కుసుమలతను ఆలోచన అడిగేవాడు.

నేడు శాంతిమూలుడు కుసుమలతాదేవి నగరికి తాను వస్తున్నట్లు వార్త పంపి రథమెక్కి ఆమె నగరుకు చేరినాడు. పట్టపురాణి అంతఃపుర నగరున్నూ, రెండవరాణి కుసుమలతాదేవి నగరున్నూ మహారాజు హర్మ్యాలతో కలిసే ఉన్నాయి. మహారాజు మహాహర్మ్య పంక్తికి వెనుక భాగంలో ఏడు పెద్దహర్మ్యాలున్నాయి. అన్నీ కలిసి ఉన్నాయికాని దేని అందం దానిదే. ఈ హర్మ్యాలలో తక్కిన రాణులు నివసిస్తూ ఉంటారు. కులహాకుల శివనాగశ్రీదేవి, వాసిష్టుల రంతుశ్రీదేవి, గౌతమగోత్రజ అయిన ఆయన శ్రీదేవి, పల్లవుల ఆడబడుచు నదీశ్రీదేవి, చాళుక్యుల ఆడబడుచులు పండిత శ్రీదేవి, శివనాగశ్రీదేవి, బాపిశ్రీదేవి ఉంటారు. చక్రవర్తి తండ్రి పురుషశ్రీ మహారాజు భార్యలు సునీతిశ్రీదేవి, స్కందశ్రీదేవి, వింధ్యాటవీశ్రీదేవి, మిశ్రశ్రీదేవి, సమశ్రీదేవులు అందరూ విజయపురంలో వేరు వేరు హర్మ్యాలలో ఉంటారు.

శాంతిమూలునికి సవతిచెల్లెండ్రు పదహారుగురు ఉన్నారు. శాంతిమూలుని తల్లి వాసిష్ట సునీతీదేవి. ఆమెకు శాంతిమూలునితోపాటు శాంతిశ్రీ, హమ్మశ్రీలు జన్మించారు. ఆ మహాప్రభువునకు సవతిచెల్లెళ్ళు నాగవసుశ్రీ, నాగశ్రీ, స్కందశ్రీ, స్కందకోటిశ్రీ, మహాశారసిశ్రీ, రతుమతిశ్రీ, మూలశ్రీ, అంతకోటిశ్రీ, మాదునిశ్రీ, నాగశ్రీ, రామశ్రీ, గోలశ్రీ, దేవిశ్రీ, బుద్దిశ్రీ, స్కందశ్రీ, సతీశ్రీ, ప్రజాపతిశ్రీ దేవులు. ఈ చెల్లెళ్ళందరిని, మాళవ, ముసిక, ప్రతిష్ఠాన, నాగపర్వత నగరాది మహాసామంతులకు ఇక్ష్వాకు శ్రీపురుష మహారాజు వివాహం కావించారు.

శాంతిమూలుడు కుసుమలతాదేవి వచ్చి నమస్కారం చేయగానే ఆశీర్వదిస్తూ, భార్యను లేవనెత్తి బిగియార హృదయానకు చేర్చినాడు. వారిరువురూ పోయి ఆ అభ్యంతర మందిరంలోని ఆసనం అధివసించారు.

“దేవీ! పులమావి పారిపోయాడు.”

“అవును ప్రభూ! నాకు ఈ ఉదయమే వార్త వచ్చింది. అతడు పారి పోవడం ప్రస్తుత స్థితిలో చాలా ఉత్తమమని నా ఉద్దేశం.”

“రహస్యంగా ఉన్న విరోధికన్న ఎదుటనున్న విరోధి ఉత్తముడు!”

“ఈతడేమి చేయగలడని ప్రాణేశ్వరుల ఆలోచన?”

“మళ్ళీ సైన్యాలు పోగుచేస్తాడు?”

“అప్పుడు?"

“ఎదురుగుండాపోయి హతమార్చవచ్చును.”

“నా ఉద్దేశం అతడు పారిపోలేదనీ, ఈ పట్టణంలో ఎక్కడో దాగుకొని ఉన్నాడనీ.”

“అదేమిటి దేవీ! నీవు ఆ విధంగా ఎట్లా ఆలోచించగలవు?”

“ఇక్కడనుండి ఒక్కసారిగా పారిపోతే అతడు దొరకటానికి ఎన్నో వీళ్లున్నాయి.”

శాంతిమూలుడు ఆలోచనాపరుడయ్యాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

176

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)