పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అను గద్యమువలనను, కవి సంశయవిచ్ఛేదములో బాలభాస్కరుని శుద్ధాంధ్రరామాయణములోని దని యుదాహరించిన

"నిగి డిరువైపుల న్వెడల నేతయినీటగువీటికోట"

అను చంపకమాలికాపాదమువలనను దెలియవచ్చుచున్నదిగాని యీశుద్ధాంధ్రరామాయణ మిప్పు డెచ్చటను గానరాదు. ఈసూరకవి తాను జేసినగ్రంథముల నన్నిటిని రామచంద్రపుర రామలింగేశ్వరుని కంకితము చేసెను. ఇతడు చేసినగ్రంథములలో నెల్ల చంద్రమతీపరిణయ మనునామాంతరము గలకవిజనరంజనము మిక్కిలి మనోహరమైనది. ఇది మూడాశ్వాసములు గల చిన్నప్రబంధ మైనది, దీనియందలి గుణసంపదను బట్టి పండితులు దీనిని పిల వసుచరిత్ర మని వాడుచున్నారు. ఇతడు చేసిన యితర గ్రంథములు రామలింగేశ్వరశతకము, కవి సంశయవిచ్ఛేదము, ఆంధ్రచంద్రాలోకము, ఆంధ్రనామశేషము, అనునవి. కవిసంశయవిచ్ఛేద మనునది మూడాశ్వాసముల చిన్నలక్షణగ్రంథము. ఆంధ్రనామశేషము పైడిపాటి లక్షణకవికృత మైనయాంధ్రనామసంగ్రహములో లేనియచ్చతెలుగుపదముల నేర్చి కూర్చినపద్యరూప మగు చిన్న నిఘంటువు. కవి తనగ్రంథముల నన్నిటిని దేవాంకితము చేయుటచేత వానినిబట్టి కవికాలము నిర్ణయించుటశక్యము కాదు. ఇతనిచే రచియింపబడిన గ్రంథములనుబట్టి కవి గోదావరిమండలములోనివా డయినట్టు కనబడుచున్నాడుగాని యితడు విజయనగరసంస్థానములో శ్రీపూసపాటి విజయరామరాజుగారి కాలములో నుండినట్టు తద్రచిత్రములయిన చాటిపద్యములు మొదలయినవానివలన దెలియవచ్చుచున్నది. విజయనగరసంస్థాన ప్రభువులలో విజయరామరాజు కిద్దఱున్నందున నితడే విజయరామరాజుకాలములో నుండినవాడో నిశ్చయింప శక్యముకాకున్నది. పెద్దాపురములో వత్సవాయ తిమ్మజగపతి మహారాజుగారు రాజ్యముచేయుచున్నకాలములో నీకవి తనప్రభువువెంట పెద్దాపురపుసంస్థానమునకు వచ్చి తాజు లందఱును సభచేసి కూరుచుండియుండగా