Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/604

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర లక్షణ గ్రంథములు

గ్రంథములలో గనుపట్టుచున్నది. నేటి తెనుగుదేశములో సుప్రసిద్ధములయిన దక్షారామము, శ్రీశైలము, కాళహస్తి అను మూడు క్షేత్రములలో మూడు శివలింగము లుండుటవలన ఈ దేశమునకు 'త్రిలింగములు కలది' అను నర్థమున “త్రిలింగ దేశము" అను వ్యవహారము కలదని ప్రతాపరుద్రీయము (క్రీ. శ. 1300) మొదలగు గ్రంథములలో చెప్పబడినది. ఈ త్రిలింగమనుశబ్దము వాడుకలో మారుపడి ' తెలుగు' అను రూపమును పొందినదని సిద్ధాంతము. దీనికి బలము శాసనములలో 'తిలింగ, తెలుంగ, తేలుంగ, తెలింగ' అను పేళ్ళు ఈ దేశమును గూర్చి వాడబడినవి కనుపట్టుటయే. కాబట్టి వాడుకలో తిలింగ పదము మారి యుండవచ్చుననునది దృఢమగుచున్నది. ఈ తెలుగులోని 'ల' కారము ఉచ్చారణమున మారి 'న'కారమయి తెనుగు అనురూప మేర్పడినదని కొందరి యూహ. కాని తెనుగు అను శబ్దము స్వతంత్రముగా తెలుగు శబ్దము కంటె ముందుగనే వాడియుండినట్లు నిదర్శనములు గలవు. 'తెనుగు' అను శబ్దమునకు ద్రావిడభాషలలో 'దక్షిణము' అని యర్థము. ఈ దేశభాగమునకు దక్షిణా పథమనియు 'దక్కన్ ' అనియు పేరుండుటవలన ఆ దక్షిణ శబ్దమునకు 'తెనుగు' అను పదము అనువాదముగా వాడబడుటవలన ఈ దేశమునకును, భాషకును తెనుగు అను పదము వాచకమయి కాలక్రమమున ఆంధ్రపదమువలెనే వాడుకలో స్థిరపడెను. ఈ మూడును తెనుగు పేళ్ళుగా ప్రసిద్ధములు.

గం. జో.

ఆంధ్ర లక్షణ గ్రంథములు  : లక్షణ మనగా “లక్ష్యతే జ్ఞాయతే అనేన" అను వ్యుత్పత్తిచేత ఒక వస్తువును లేక ఒక విషయమును గుర్తుపట్టి తెలిసికొనుటకు పనికివచ్చు సాధనమని యర్థము. ఇతర వ్యావర్తకముగా (ఒక దానికి చెప్పిన లక్షణము మరియొక దానినుండి వేరు పరచునట్లుగా) ఒక వస్తువును నిర్దేశించుట లక్షణము, లక్షణ మనగా 'గుర్తు' అని స్థూలముగా అర్థము జెప్పవచ్చును. ఏ వస్తువునకైనను ప్రత్యేకమగు లక్షణము లేనిచో దానిని చక్కగా గ్రహింపజాలము. లక్షణమును జెప్పునప్పుడు అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అను దోషములు లేకుండునట్లు చెప్పవలయును. అట్టి లక్షణ

జ్ఞానమువలన లక్ష్యజ్ఞానము సులభముగా గలుగును.కనుక పూర్వులు ప్రతి శాస్త్రమునందును లక్ష్య లక్షణ సమన్వయ పద్ధతి నవలంబించి యున్నారు. ఛందో౽లంకార వ్యాకరణ శాస్త్రములను రచించుపట్టున తెలుగు లాక్షణికులు సైతము అట్టి పద్ధతినే అవలంబించిరి. ఆంధ్ర భాషయందు లక్ష్య లక్షణ సమన్వయ పద్ధతితో గత శతాబ్దులందు వెలసిన శాస్త్రములలో "వ్యాకరణ శాస్త్రము, అలంకార శాస్త్రము, చంద శ్శాస్త్రము నిఘంటువులు" అనునవి ముఖ్యములు. ఈ శాస్త్రములు నేటివరకును పెరుగుచున్నవి. కనుక వీటిని గురించిన అంశములను తెలిసికొనుట మనకు ప్రస్తుతము.

I వ్యాకరణ శాస్త్రము  :- పదములను బ్రకృతి ప్రత్యయ విభాగ పురస్సరముగా నిరూపించుటచే ఈ శాస్త్రమును 'వ్యాకరణ' మని అనుచున్నారు. “వ్యా క్రియంతే శబ్దాః సంస్క్రియంతే అనేన ఇతి వ్యాకరణమ్" అని వ్యుత్పత్తి. శబ్ద సంస్కార సాధనమని యర్ధము. ఋగ్వేద పద కారుడగు శాకల్యుడు మొదలుకొని బహు వ్యాకర్తలు సంస్కృత భాషకు వ్యాకరణమును రచించిరి అవి నామమాత్రా వశిష్టములు. ఇప్పుడు లోకవ్యవహార సాధనమైన ప్రాచీన వ్యాకరణము పాణినీయమే. పాణిని రచించిన అష్టాధ్యాయి, 3981 నూత్రములతో వైదిక, లౌకిక భాషా ప్రపంచమును సంస్కరించునట్టి ఉత్తమ వ్యాకరణము. అదియే దేశభాషా వ్యాకరణములకు మార్గదర్శకమైనది. తెలుగు వ్యాకర్తలు పాణినీయ పరిభాషనే అవలంబించిరి.

"ప్రయోగమూలం వ్యాకరణమ్"; "ప్రయోగ శరణా వైయాకరణాః" అను లోకోక్తుల వలన శిష్ట వ్యవహారము వ్యాకరణ రచనకు ఆధారమనుట స్పష్టము. ప్రాచీనాంధ్ర వైయాకరణులు కవి ప్రయోగములను, వాటిచే తెలియవచ్చు నితరాంశములను, కవిమార్గ విరుద్ధములు కానట్టి లోక వ్యవహార సిద్ధములను ఆధారముగా గోని వ్యాకరణములను రచించిరి జీవద్భాషలగు తెలుగు మున్నగు వాటియందు పూర్వకవి ప్రయుక్తములు గాకున్నను, వ్యాకరణ లక్షణమునకు దూరముగా నున్నను, తత్త త్కాలములయందలి కవులు ప్రయోగించిన శబ్దములు శిష్టవ్యవహారము అను శాణమున వన్నెలు దీరినవై