Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరబ్బీ భాషాసాహిత్యములు


అరబ్బీ పద్యఖండములు మనదనుక వచ్చియున్నవి. వీరే గాక, అరబ్బీలో తమ కావ్యముల యొక్క దివానులను (కూర్పులను) సంతరించి పెట్టిన కవులును గలరు. మొహమ్మదు బి అబ్దుల్ అజీజు, (మలబారు, 10 వ శతాబ్దము), సయ్యదు. ఆలీఖా౯ ఇజ్ను మాసం (1705), సయ్యదు అబుదుల్ జలీల్ బిల్గామి (1715) సయ్యదు గులాం ఆలీ ఆజాదు (1785) అనువారు అట్టి కవులు. ఈ కవులందరును పార్శీ కవిత్వము వలన ప్రభావితులయి యుండిరి. వీరి కందరకును, శబ్దార్థాలంకారముల యందును, పార్శీ పద్య విన్యాస వైఖరి యందును ప్రీతి మెండు. మలబారు కవియగు మొహమ్మదు అరబ్బీ భాషలో ఒక మత్ నవి (ఇందు 500 పద్యములు గలవు) అను కావ్యమును రచించెను. ఈ కావ్యమునందు కాలికట్ జామొరి౯ బుడతకీచులతో జరిపిన పోరాటములును, అతనికి ఇస్లాంమతము నెడగల ప్రీతియు వర్ణితములైనవి. ఇబ్నెమాసం కవియొక్క “ఆల్ బదీయాల్" అను కావ్యమునందు, అలంకార చిత్ర కల్పనలకు ఉదాహరణములు సంకలితము చేయ బడినవి. ఇతర కవుల వలెనే ఆజాదు కూడ అలంకార గర్భితముగా వ్రాయుట యందు అమితేచ్ఛ గలవాడు. ఈతడు హిందీ భాషలోను, సంస్కృత భాషలోను గల ఉపమానములను,అలంకారములను తన అరబ్బీ కవిత్వములో ప్రవేశ పెట్టినాడు. భారతీయ ముసల్మానులు ధార్మిక గ్రంథ పఠన, పరిశీలనములకు కలిగించినదోహదము మిగుల విలువగలది.

నూత్న భావోదయము (1798-1955): 1798లో అరబ్బులకు పాశ్చాత్య సంస్కృతీసంసర్గము మరల కలిగిన నాటినుండియు అరబ్బీ వాఙ్మయమునందు ఆధునిక విధానముల కనుగుణములయిన మార్పులు ప్రారంభమయ్యెను. ఈ నవీనత ఇప్పుడిప్పుడే ఈజిప్టు రంగమందు ప్రారంభమయినది. యూరోపియ పద్ధతులు ప్రకారము పాఠశాలలు స్థాపించుట, వార్తా పత్రికలు వేగముగా వ్యాప్తి చెందుట, ఆధునిక ఐరోపీయ గ్రంథరాజములను అరబ్బీభాషలోనికి అనువదించుట ఇవియే నవీనతావ్యాప్తికి కారణభూతములు, అనుప్రాసాలంకార భూయిష్ఠమైన ప్రాచీన గద్య రచనా విధానము విడువబడినది. ఇప్పటి పారిశ్రామిక యుగమునకు తగినట్లుగా సులభ, సరళ రచనలు ఆ స్థానము నాక్రమించినవి.. షేకు మహమ్మదు అబ్దుల్ అఝరు నందు గావించిన ప్రబోధ ఫలితముగా కురా౯, న్యాయ శాస్త్రము, ఐస్లామిక తత్త్వశాస్త్రములపై వ్రాయబడిన భాష్యములు, నూత్నపద్ధతిలో సమన్వయము పొందసాగెను. ప్రవక్తల యొక్కయు, కవుల యొక్కయు, పండితుల యొక్కయు రచనలను తులనాత్మకముగను, పరిశీలనాత్మకముగను, పఠించుటచే శాస్త్రీయ పరిశోధనకును, ఆధునిక విమర్శన విధానమునకును, అంకురార్పణము జరిగెను. కాల్పనిక కథా (fiction) రంగమునందు అరబ్బీ సాహిత్యము మీద యూరోపియను ప్రభావము స్పష్టముగా కానిపించు చున్నది. కళాత్మకముగ కథావిరచనము చారిత్రక నవలలతో ప్రారంభమైనది. ఐరోపా దేశములలో విద్యార్థనము చేసిన అరబ్బు పండితులు ఫ్రెంచి, ఇంగ్లీషు, జర్మన్, ఇటాలియన్ భాషలలోని గ్రంథములను అరబ్బీ భాషలోనికి అనువాదము చేయసాగిరి. అల్మాన్ ఫాలూటి, అజ్జయ్యాత్, అల్ మాజిని అనువారలు యూరోపియ అద్భుత కథాసాహిత్యమును (Romance) తమ అభిరుచుల కనుగుణముగా అనువదించుటకు మార్గదర్శకులయిరి. తరువాత తౌఫిఖ్ అల్ హాకీం, అల్ మాజిని, అహమదు తైమూరు అనువారు కేవలము ఈజిప్టు దేశమునకు చెందిన స్వతంత్ర కల్పనాకథలను నిర్మించిరి. ఈజిప్టులో నాటకశాల ఏర్పాటయినతరువాత, ఫిల్ము కంపెనీలు, రేడియో కేంద్రములు, నాటక సాహిత్య పరంపర, నాటక కథలు, పిల్ముకథలు బయలు వెడలినవి.

గద్యవలెనే ఆధునిక పద్యరచనయు ఫ్రెంచికవుల రచనలను పల్లెటూరి పాటలుగా (zagal) అరబ్బీకరణము చేయుటతో ప్రారంభమయినది. సంప్రదాయ సిద్ధముగా వచ్చుచున్న ఖసీదాపద్ధతిని అదే ఛందోలంకారములతో సాగించుచుండినను, ఆధునిక భావ విశేషములును, ఐస్లామిక యూరోపీయ తత్త్వసమ్మేళనమును పద్య కవిత్వములోనికి గొని తేబడెను. ప్రాత పద్ధతుల ప్రకారము గేయగీతికలు (Odes), శోకరసాత్మక గీతికలు (Elegy), స్తోత్రములు (Panegyrics), గీతమాలికలు (Sonnets) యథాతథముగా రచితము లగుచున్నను, వాటితోపాటు దేశభక్తి, భౌతిక, రాజకీయ, సామాజిక విషయములు కావ్యవస్తువులుగా నుండుట హర్షణీయము. అల్- బరూది