Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరబ్బీ భాషాసాహిత్యములు

మున యూరపుఖండములో కూడ అత్యంత ప్రామాణికమైనవిగా పరిగణింపబడెను.

ఇబ్రహీం అల్ ఫజారి అనువాడు ఖగోళశాస్త్ర విషయక కోష్ఠములను (Tables) సిద్ధముచేసెను. ఖలీఫా అల్ మన్సూరు ఆజ్ఞ ప్రకారము భారతీయగణితశాస్త్ర సంబంధములగు ‘సిద్ధాంత' గ్రంథములు అరబ్బీ భాషలోనికి అనువదింపబడెను. అల్ "ఖవారిజ్మి" అనువాడు ఈ గ్రంథముల సారములను రచించెను. అలెగ్జాండ్రియా పట్టణ వాసియు గణిత, జ్యోతిష శాస్త్రవేత్తయునగు 'టాలెమీ' అను గ్రీకు పండితుడు రచించిన అల్ "మెజెస్టు" (al majest) అను గ్రంథమును ఇబ్నె మేటరు (829) అనునతడు అరబ్బీలోనికి భాషాంతరీక రణముచేయగా, జ్యోతిశ్శాస్త్రవాఙ్మయము వెన్నులు వేసి మరింత వృద్ధిచెందెను. అరబ్బీ జ్యోతిశ్శాస్త్రజ్ఞులలో గణనీయులు అల్ ఫరఘాని, అల్బాధాని, ఇబ్నె యూనుసు, ఇబ్నె అల్ హైధాం, జేబరు ఇబ్నె అఫ్గా అను వారలు, బాగ్దాదు, డమాస్కను, కైరోలందు నక్షత్ర శాలలు నిర్మాణము నొందుటచే ఈ విద్యకు మిక్కిలి ప్రోత్సాహము కలిగెను.

ఇతర భౌతిక శాస్త్రముల వలెనే అరబ్బుల వైద్యశాస్త్రము గూడ అనువాదములతోను గ్రీకు భీషఙ్మణుల పద్ధతి నవగాహన చేసికొనుటతోను ప్రారంభమయ్యెను. కాని, అరబ్ విద్వాంసులు ప్రత్యక్షావలోకనము, స్వానుభవము, వైద్యవిజ్ఞానమునకు ఎంతయు తోడ్పడి, అది విశాలము, స్వతంత్రము అగు శాఖగా పుష్టినొందెను. అరబ్ వైద్యశిఖామణులు ఓషధీతంత్ర శాస్త్రమునందును (Pharmocology), రోగలక్షణ శాస్త్రమునందును (Symptomatology) గొప్ప ప్రావీణ్యమును బొందిరి. వారి వైద్యశాలలు, వైద్యవిద్యాశాలలు పాశ్చాత్యులకు మార్గదర్శకములుగా నెగడెను. జేబర్ అబ్నె హయ్యా౯ అనునతడు రసాయనశాస్త్రమునకు పునాదివేసెను. అది క్రమక్రమముగా వృద్ధిచెంది క్రొంగ్రొత్త విషయములను కనుగొనుటకు మార్గమేర్పడెను. ఇప్పటి రసాయన శాస్త్రమునకు గల పరికరములును, పరిభాషయు అరబ్బీయ రసాయనపండితులు పెట్టిన భిక్షయే. భౌతిక చరిత్ర యందు (Natural History), వృక్షశాస్త్రమునందు, వ్యవసాయ శాస్త్రమునందు అదేవిధముగ ప్రవృద్ధికలిగెను. తత్త్వవేత్తల యొక్కయు, వైద్యవేత్తల యొక్కయు జీవితచరిత్రలు నిర్మితము లయ్యెను. ఖిప్తి రచించిన “తారీఖ్-అల్-హుకమా” అను గ్రంథమును, “ఇబ్నె అబి ఉసై బి ఆ" రచించిన కితాబె అల్- ఉయూన్- అల్-అంబా" అను గ్రంథమును తత్సంబంధము అయినవే. . భూగోళము_చరిత్ర  : ఖలీఫాల యొక్క తపాలాశాఖా వ్యవస్థ, సమర్థమగు ప్రభుత్వవిధానమును భౌగోళికాంశములను గ్రంథస్థముచేయుటకు పురికొల్పెను. ఇక పుణ్య స్థల సందర్శనాభిలాషులకు తాము పోయెడి దేశములకు సంబంధించిన విజ్ఞానము అవసరము కాజొచ్చెను. ఈ భౌగోళిక లేఖనములు రహదారులు, వర్తక వాణిజ్య ములు, తత్ ప్రతిష్ఠాపనములనుగూర్చి మాత్రమే వర్ణించుటతొ తృప్తి పడలేదు. అచ్చటి ప్రజల ధార్మిక, సాంఘిక, సంస్కృతీ జీవిత విషయములనుగూర్చిన యథార్థ విషయములను గూడ వర్ణించుచుండెను. ఇబ్ను ఫాడ్ల౯, అబుదు లాఫ్, ఖాస్రాజి, ఇబ్ను జబీరు, ఇబ్ను బతూతావంటి దేశ పర్యటనపరులు వ్రాసిన గ్రంథములు అరబ్బుల ధార్మిక, సాంఘిక విషయ పరిస్థితులనుగూర్చి వివరణాత్మకములయి యుండుటయే గాక, తాము పర్యటించిన దేశముల ఆచారములు, సంప్రదాయములు, వ్యవస్థలు మున్నగునవి తెలుపుచుండెను. భూగోళశాస్త్ర పదజాలమును అకారాదిగ వ్రాసి వివరించిన కోశములు, నిర్మితము లయ్యెను. బక్రి రచియించిన "మూజం మాస్తాజం" అను గ్రంథమును, యాఖుత్ రచించిన “ము జాం అల్ బుల్గాన్” అను గ్రంథమును ఇట్టి తరగతిలోనివే.

ప్రాచీనయుగ కవిత్వమును గూర్చిన గాథలు, ఆయా తెగల వంశావళి నివేదికలు చరిత్ర పఠన పాఠనములకు దారితీసెను. ఇస్లాం ప్రారంభచరిత్ర జ్ఞానమునకు ప్రవక్త యొక్క జీవిత చరిత్రమును, ఇస్లాం యుద్ధములను(Maghazi) గూర్చిన సామగ్రిని సమకూర్చవలసిన అగత్య మేర్పడెను. ప్రవక్త యొక్క జీవితచరిత్రను మహమ్మదు ఇబ్ను ఇపాఖ్ అను నతడు రచించెను. ఇది విషయ క్రమబద్ధమయిన గ్రంథము. అరబ్బీయుల చరిత్ర- భూగోళ రచనలు ఒక అపూర్వ శాస్త్రప్రాయముగా రూపొందెను. చరిత్రకారులు తమ కథనమునందు వేర్వేరు పద్దతుల నవలంబించిరి. ఐతిహాసికుల పరంపర చెప్పినది చెప్పి