అభ్యవహారము - ఆర్షపద్ధతి
అగ్ని పుట్టిన పిదప, “ఉఖ్యేజాత ఆహవనీయమనుగ మయ్య" (ఆ. శ్రౌ. సూ.) అను సూత్రానుసారము ఉఖాగ్ని పుట్టుట
తోడనే, అడుగుననున్న ఆహవనీయాగ్నిని, పూర్తిగా ఆర్పివేసి, ఈ ఉఖాగ్నినే, ఆహవనీయాగ్ని స్థానీయముగా వ్యవహరింతురు. అనగా ఆహవనీయాగ్నియందు చేయవలసిన హోమాదులను ఉఖాగ్నియందే చేయుదురు. ఇట్టిది
ఆచారముగా చెప్పబడినది. అనంతరమందు కామనా విశేషముచే కృష్ణ యజుర్వేద సంహితలో “అంబరీషా దన్న కామస్యావధ్యా దంబరిషేవా అన్నం బ్రియతే సయోన్యేవాన్న మవరుం ధే॥ (1-1-10) “లోకములో మృణ్మయ పాత్ర యందు అన్నము వండుదురు గాన అన్నమును కోరు యజమానునకు అంబరీషము (మృత్పాత్ర)నుండి అగ్నిని తీసికొని వచ్చి ఉఖయందు అగ్నిని ఉత్పాదనము చేసినచో అట్టి యజమానునకు సమృద్ధమైన అన్నము లభించును" అని చెప్పబడినది. ఈ శ్రుతివలన ఆర్ష సంప్రదాయములో మృణ్మయపాత్రచేతనే అన్నమును వండు చున్నట్లు స్పష్టమగు చున్నది.
మృణ్మయపాత్రను తడుపుట : లోకములో క్రొత్త మృత్పాత్రలను ప్రథమములో పాలతో తడిపి వాడుచుండెడి సంప్రదాయము కలదు. దీనిని సహేతుకముగ శ్రుతి విధించుచున్నది. కృష్ణ యజుర్వేద సంహితలో
"అసుర్యం పాత్ర మనాచ్ఛృణ్ణ మాచ్ఛృణత్తి దేవత్రా
కరజ క్షీ రేణాచ్ఛృణత్తి పరమం వా ఏత త్పయోయ
దబుక్షీరం పరమేణై పానాం పయసాచ్ఛృణత్తి
యజుషా వ్యావృత్యే. (కృ. య. సం. 5-1-7)
యజ్ఞసాధనమగు మృణ్మయపాత్రను కాల్చిన పిదప ప్రథమములో ద్రవద్రవ్యముచే తడపకుండా వాడినచో ఆ పాత్ర అసురయోగ్యమగును. ద్రవద్రవ్యముచే తడిపి వాడినచో ఆ పాత్ర దేవకర్మలకు యోగ్యమగును. అనంతరము దేనితో తడపవలెను అను శంకపై లోకములో మేకపాలు సర్వవ్యాధులను తొలగించునటుల ప్రసిద్ధి కలదు. కావున అవి ఉత్తమ మయినవని తెలియనగును. వేదములో గూడ "ఆగ్నేయీ వా ఏషొ యదజా" (కృ.య. సం. 5-4-3) (ప్రజాపతి ముఖమునుండి అగ్నితో కూడ మేక పుట్టినది గాన మేక అగ్ని సంబంధ మైనది. అందుచే అది ఉత్తమమయినది) అని చెప్పబడినది. ఇవ్విధముగ లోకమునను వేదములలోను మేక ఉత్తమమైనది గాన దాని పాలచే క్రొత్తకుండలను తడుపవలెను అని చెప్పి “లోకములోవలె మంత్రరహితముగ తడుపరాదు. లోక వైలక్షణ్యముకొరకు యజ్ఞములో మంత్రములచే తడుపవలెను." అని వచించుటచే, లోకములో మంత్ర రహితముగ పాలతో తడుపుచున్నట్లు స్పష్టమగుచున్నది.
లోకములో మేకపాలు తరచుగ సంభవించక పోవుటచే పాలతో మాత్రము తడుపుచుండెడి ఆచారము నేటి వరకు ప్రచారములో నున్నది. ఈ విధముగ శ్రుతిప్రమాణములచే క్రొత్తకుండను ప్రప్రథమము పాలతో తడిపి, అనంతరము ఆకుండతో వంటచేయవలెనని స్పష్టమగు చున్నది.
అన్నము వండుట : వంట చేయునపుడు దంపుడు బియ్యమును కడుగకుండ అత్తెసరుగా వండవలసినదిగ “న ప్రక్షాళయతి, న ప్రస్రావయతి, న గాలయతి, జీవతండుల మివ శ్రవయతీతి విజ్ఞాయతే" అని ఆ. శ్రౌ. సూత్రము చెప్పుచున్నది. ఈ సూత్రముచే వంట చేయు బియ్యమును కడుగకూడదు. దానిలో పోసిన నీటిని, కడుగును తీసివేయరాదు. నీటిని పోసిన తరువాత గాలించరాదు. అనగా నొక్కికడిగి నేమరాదు. అత్తెసరుగా వండవలయును. అన్నము చిముడకూడదు. వంట బిరుసు పదునుగా నుండవలయును అని అగ్న్యాధానమునందలి శ్రౌతకర్మలో చెప్పబడినది. దర్శపూర్ణమాసలు అను శ్రౌతకర్మలో "ప్రక్షాళ్య తండులాన్" (తండులములను కడిగి) అని చెప్పబడినది గాని గాలించి కడుగవలయునని చెప్పబడలేదు. అందుచేత బియ్యమును కడుగుకుండ అత్తెసరుగా వండుట, బియ్యమును కడిగి అత్తెసరుగా వండుట అను రెండువిధములు కలవనియు, అట్టి అన్నము దేవతా యోగ్యమగుననియు స్పష్టమగుచున్నది.
రొట్టెను కాల్చుట : కృష్ణయజుర్వేదమునందు "యో విదగ్ధ స్స నైర్ ఋతో యో ౽శృత స్స రౌద్రోయ శ్శృత స్స దేవ స్తస్మా దవిదహతాశృతం కృత్య స్స దేవత్వాయ॥ (కృ. య. నం.2 కాం.6ప్ర.3అ.) అని కలదు. పురోడాశము (రొట్టె) మాడునట్లు విశేషముగ కాల్చ బడినచో అది రాక్షసులకు ప్రియమగును. కొంచెము పచ్చిగా నుండినచో ఆ పురోడాశము రుద్రునకు ప్రియమగును.