పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాలకాండము

197

యచ్చోటసమయసం - ధ్యాదులు దీర్చి
యిచ్చలకితవైన - యెడలనున్నంత 4750

—: శివధనుఃప్రభావమును జనకుఁడు చెప్పుట :—


కొలువుండి యాజన - కుఁడు మఱునాడు
పిలువనంపిన నతి - ప్రీతిఁగౌశికుఁడు
తనవెంట రాజనం - దనులు రా వచ్చు
మునిఁజూచి యపుడర్ఘ్య - మును పాద్యమొసఁగి
యాసనంబిచ్చి సు - ఖాసీనుఁడగుచు
'నోసంయమీంద్ర! భృ - త్యుల మందఱమును
చెప్పినయటులఁజే - సెద మేమిగార్య
మిప్పుడు గావింతు - మెఱిఁగింపుఁ ”డనిన
యీ దశరథ పుత్రు - లీశానువిల్లు
నీదుమందిరములో - నెలకొన్నదనుచు 4760
విని చూచిపోనెంచి - విచ్చేసినారు
కొనితేరఁబంపుమా - కోదండ” మనిన
జనకుఁడిట్లనియె. "నో - సంయమినాథ!
తనయింటిలో నీశు - ధనువు గల్గుటకుఁ
గారణంబున్నదా - కత యేర్పరింతు
వీరలు మీరలు - వినుఁడంచుఁబలికె.
నిమికి నాఱవవాఁడు - నిజధర్మరతుఁడు
రమణీయమతి దేవ - రాతుఁడన్ రాజు
సవన మొనర్చి మె - చ్చఁగఁజేసి తనకు
దివిజు లొసంగఁగాఁ - దెచ్చె నీవిల్లు 4770