శ్రీ
కా మే శ్వ ర్యై న మః
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
ప్ర థ మా శ్వా స ము
శ్రీ
మత్కందుకమట్లు గుండ్రమయి వారిన్ రేండపా ళ్ళొక్కపాల్బూమిన్ నిండియు నూఱునర్వదియుఁ గోట్లు మర్త్యు లొప్పారఁగా
వ్యోమంబంటు నగాధిరాజ నివహంబుల్ మీఱ విశ్వంబు శో
ధామూల్యస్థితి నొప్పు నీశ్వరు ననంతైశ్వర్యముల్ చాటుచున్.1
సీ॥ కాంచన శృంగభాగము కిరీటము గాఁగఁ
గాశ్మీర మాస్యపంకజముగాఁగ
సింధు గంగానదుల్ చేఁదోయి గాఁగ నా
ర్యావర్తదేశం బురంబుగాఁగ
వింధ్యాచలేంద్రంబు బెడఁగు మధ్యము గాఁగ
గౌతమీ కనక మేఖలయుఁగాఁగ
మలయ సహ్యాద్రు లడ్గులు గాఁగ సింహళ
ద్వీప మంథోరుహ పీఠిగాఁగ
గీ॥ లవణ రత్నాకరము సరః ప్రవర మగుచుఁ
జెలఁగు భారత దేశ లక్ష్మీ సమగ్ర
భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవము
లిట్టివని వివరింపఁగా నెవరి తరము. 2
శా॥ జానొందన్ బహుళాంబు పూరము వనాకాశంబలల్ నింప స
స్యానీకంబు సమృద్ధమై యెదిగె భాగ్యస్ఫూర్తి హెచ్చింప ల
క్ష్మీనిత్యోత్సవ మందిరంబయి తనర్చెన్ విశ్వసర్వోన్నత
స్థానంబంది సమస్త వైఖరులు రాజస్థాన మవ్వేళలో.3
సీ॥ ఇట్టిరాజస్థాన మెపుడు స్వతంత్రులౌ
జనపాలమణుల పాలసమునొందు
దేశంబు లిరువది దీపింప వెలుగొందు
వానిలోనెల్ల మేవాడదేశ
మగ్రగణ్యము; దాని యధిపతియగు వాని
‘రాణా' యని జనులు ప్రస్తుతింతు
రతఁడు మతాధిపత్యమున నెల్లరకు జ
గద్గురుఁడగుచు విఖ్యాతిగాంచు.
గీ॥ నగరములలోనఁ గాశికానగర మట్లు
చిరయశముఁగాంచుఁ జిత్తూరు పురవరంబు
నచటి రాణాయు నందఱ నగ్రపూజ్యుఁ
డెల్ల సురలందుఁగాశి విశ్వేశు మాడ్కి.