పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


గీ॥ కాపుగా నైన్యముల నిచ్చికాన్క లిచ్చి
    తగిన గౌరవ మిచ్చి స్వాతంత్య్ర మిచ్చి
    యెడఁదఁ గరుణకు, జోటిచ్చివిడిచి పుచ్చెఁ
    గుంభరాణా సమాను లీక్షోణిఁ గలరె. 101
   
మ॥ తన సంపూర్ణజయంబుఁ దెల్పఁగ జయస్తంభమ్ములన్ భక్తి పెం
    పును సూచింపఁగఁ గోవెలల్ నిలిపే నాబూశృంగ శృంగాటకం
    బున; వ్యాఖ్యాన మొకండు వ్రాసి యనయంబున్ గీత గోవిందమున్
    జను లాబాలము నేర్వఁజేసెఁ గవితానందైక సంధాతయై. 102
    
గీ॥ కత్తీ కలములచే రెండు గతులఁ గీర్తి
   కాంతఁ గొలిచిన మేటి భూకాంతులందు
   నింత దొడ్డవాఁడున్న వాఁడే యటంచు
   క్షోణి జనులెన్న మనియె నా కుంభ నృపతి. 103
   
సీ॥ సాధ్వి మీరాబాయి సౌజన్య ధన్య కుం
               భవసుంధరాధీశు పట్ట మహిషి
    జగదేక పావిత్య్ర సంపద కీలేమ
               పర్యాయపదము గోపాలకృష్ణు
    నడుగులు తరఁచి భక్త్యావేశమునఁ బొంగి
               యమృత గీతములు పెక్కాలపించె
    దన్మాధురుకిఁజొక్కి తలలూఁచి యాతల్లి
               స్మరియింప నట్టి యన్నరులు లేరు
               
గీ॥ ద్వారకాపురి మొదలుగా వారణాసి
    వఱకు దేవాలయముల గోపాలదేవు
    గూర్చి కీర్తించి యాయమ్మ కూరుచున్న
    చోటులను నేఁటికిని గూడఁ జూపుచుండ్రు. 104

        

-:రాణా సంగ్రామసింహుని పాలనము:-


        
మ॥ చరితార్ధుండగు కుంభుపౌత్రుఁ డవలన్ సంగ్రామసింహుండు భూ
    వరుఁడయ్యెన్ రణమన్నఁ బండుగు వలెన్ భావించు శౌర్యాఢ్యుఁ డీ
    పురుష శ్రేష్ఠుఁడు పెక్కు ఘోరసమరంబుల్ చేసి వైరి క్షితీ
    శ్వరులన్ గెల్చుచు దేశమందు వినిచెన్ సౌభాగ్య భాగ్యోన్నతిన్. 105