10
శ్లో. అశ్రాంతశ్రుతిపాఠపూతరసనావిర్భూతభూరిశ్రవా,
జిహ్మబ్రహ్మముఖౌఘవిఘ్నితనవస్వర్గక్రియాకేళినా...
అనుటకు
శా. వేదాభ్యాసవిశేషపూతరసనావిర్భూతభూరిశ్రవా
సాదబ్రహ్మముఖౌఘవిఘ్నితనవస్వర్గక్రియాకేళిచే.
నన్నది తెలుఁగుసేఁతయఁట.
ఇఁక నీగ్రంథముఁ గూర్చి యొకటిరెండుమాటలు. ఇది లోకులనుకొనునట్లు హర్షనైషధమునకు డుమువులు చేర్చిన యాంధ్రగ్రంథముకాదు. శ్రీనాథునిశ్లోకములలో మూలశ్లోకము లిమిడినట్లుగాఁ గనఁబడునుగాని మూలశ్లోకములలో నాతఁడిమిడినట్టు లగపడదు. చమత్కారార్థము గమికర్మీకృతాదులగు నొండురెండుశ్లోకముల తెనుఁగుసేఁతను జూచిమోపిన యీలోకనిందలో నేమాత్రమును సత్యము లేదు. మిక్కిలి ప్రౌఢసాహిత్యముగల సంస్కృతనైషధము నటుంచి శ్రీనాథుని కృతినే చదివితిమేని మూలాపేక్షలేకయే సర్వమును విశదమగును. ఇదియే దానిమూలసమప్రాధాన్యమును విశదము సేయును.
ఈకావ్యమునఁ గవితాశిల్పము చక్కగాఁ బ్రదర్శితమైనపట్టు నలదౌత్యఘట్టము. హంసదూత్యము దానితరువాతిది. అందు మొదటిదానిలో నాయికానాయకులకు జరగిన ప్రౌఢసంభాషణాక్రమము, కవికిఁగల లోకజ్ఞతకును నౌచితీపరిపాలనకును సాక్ష్యముగా నున్నది. హంసదూత్యము పింగళిసూరన శుచిముఖీదూత్యమునకు నొరవడిగా నున్నది.