పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 55

తే. లీల రత్నాకరుండు నిండోలగమున
నుండి తనుఁ బిల్వఁబంప నమ్మండలేంద్రు
జేరి నానావిధద్వీపచిత్రదేశ
వివిధవార్తాప్రసంగము ల్విన్నవించి. 220

క. తెచ్చిన సమస్తవస్తువు
లచ్చుపడ స్సమ్ముఖమున నలవడ నిడి త
న్మెచ్చి కొలువెల్లఁ బొగడఁగ
నచ్చో వివరింపఁదొడఁగె నధిపుం డలరన్. 221

రగడ—
దేవ యవలోకింపు మిది తెలిదీవిఁ బొడమిన పద్మరాగము
పావనం బొనరించుఁ దను వనపాపొయరుచి నల పుష్యరాగము
తళుకుఁ దుమ్మెదతాళి కగునని తలఁపుమీ యీళాపునీలము
వెలఁదులకుఁ జేర్చుక్కతుద నొదవించు ముడువగు నీప్రవాళము
గొప్పలగు చౌకట్లకని చేకొంటి మివె కట్టాణిపూసలు
చెప్పఁ జూపంగరావు మక్కాసీమ వీగుజరీతివాసులు
ఎత్తుకెత్తు మెఱుంగుకుందన మిచ్చి తెచ్చితి మీసిరాజులు
హత్తివాయుమనోజవంబుల నలరు నీసామ్రాణితేజులు
కురుచలైనను నిచ్చమదమునఁ గొఱలు నీయేనుంగుగున్నలు
దొరయ నొకపరిపాటి దొరలకు దొరక వీవిడికెంపుమిన్నలు
కలువడంబులఁ గలయ వివి చొక్కంబులగు కస్తూరివీణెలు
తెలిసి వేయివరాల విలువలు దీర్చితిమి యీరుద్రవీణలు
నిలువు నిలివెఁడు సోగవగపెన్నెరుల కివి సమకట్టు జల్లులు
పిలుపులను గడుఁబ్రోది సేయఁగఁ బెరిఁగినవి జవ్వాదిపిల్లలు
గమ్మురని పన్నీరు తొలకెడుఁ గంటివేయివి గాజుపనఁటులు