400 శుకసప్తతి
తే. ఇలఁ బతివ్రత లగువారు గలిగిరేని
కాళి యొనరించు నిజశిరఃకంపనంబు
మాన్పు మని చాఁటఁ బనుపుము మానవేంద్ర
యప్పు డందటి వగ తెలియంగవచ్చు. 70
క. అని యవ్వధూటి పలుక
న్మనుజకులేంద్రుండు మాఱుమాటాడఁగఁ గొం
కినవాఁడై భువిఁ జాటం
బనిచెం దద్వచనరీతిఁ బ్రకటముగాఁగన్. 71
తే. అంత రాజాజ్ఞ మీఱరాదంచు ధరణిఁ
గలుగుసతు లెల్ల వచ్చి నిక్కమగుభక్తి
నెంత మ్రొక్కిన నంతంత కెచ్చసాగె
ధూర్జటివెలందిమూర్ధవిధూననంబు. 72
తే. కాంతిమతిదక్క మనుజలోకమున నిఁకఁబ
తివ్రతలు లేరటంచు నుదీర్ణవచన
ముఖరులై జనులాడ నమ్ముదిత లెల్ల
సిగ్గుపడి యేగి రప్పు డచ్చెరువుఁ జెంది. 73
ఉ. అంతట రాజమౌళి పునరాగతుఁడై ధరణిన్వధూటికా
సంతతిలోనఁ జూడ నొకసాధ్వియు లేదని యాత్మలోన సి
ద్ధాంత మొనర్చితి న్మముఁ గృతార్థులఁ జేయుమటంచు మ్రొక్క న
క్కాంతిమతీవధూటి యవుఁగాకని కాళిగృహప్రవేశయై. 74
తే. రాజు మొదలయినవారి దూరమున నునిచి
గర్భగృహమున కరిగి వేగమ కవాట
బంధన మొనర్చి గ్రక్కున భద్రకాళి
డాసి నిలుచుండి ధీరతాడంబరమున. 75