పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

382 శుకసప్తతి


తేరుక్రిందటి మరుగుజ్జుఁ జేరి వానిఁ
గలసి యేతెంచు నిది మీకుఁ గానఁబడదు.

624


ఉ.

దేవరకొల్వు దేరిన మదీయగృహంబున కేగువాడనై
యే వెసఁ బోవుచోఁ గురిసె వృద్ధవరాహకఠోరఘర్ఘరా
రావమహాశనిధ్వనిపరంపరతో నొకవాన మొన్న రే
యావిలమానసాంబుజుఁడనై యొకమండపసీమఁ జేరితిన్.

625


తే.

అచ్చటికి వచ్చె నిమ్మందయాన వచ్చి
తేరుక్రింది ప్రతీక్షణాధీనుఁ డైన
గుజ్జుఁ జేరిన వాఁ డతిక్రుద్ధుఁ డగుచు
నింతతడ వేల రావైతివే యటంచు.

626


తే.

గుండియలు గ్రుళ్లఁదన్నిన గ్రుక్కుమిక్కు
రనఁక యాతనికినుక చల్లాఱనిచ్చి
విక్రమార్కుడు నిద్రగావించుదనుక
వెడలి రారాదటంచును వేడుకొనియె.

627


తే.

అతని పదఘాతముల కోర్చినట్టిదాని
కివ్విరులబంతివ్రేటున కింతమూర్ఛ
వచ్చెనే యంచు నవ్వితి వసుమతీశ
చనవరియటంచు నాతప్పు సైఁపవలయు.

628


క.

అన విక్రమార్కభూపతి
విని వెఱుఁగున ముక్కుమీఁద వ్రేలిడి చింతన్
మునుఁగుచు బాలసరస్వతిఁ
గని తెలిసె న్మీనహాసకారణ మౌలే.

629


తే.

కాకయుండినఁ దైలపక్వంబులైన
మత్స్యములు నవ్వునే యంచు మందబుద్ధి