పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380 శుకసప్తతి


చల్లఁ జేయుమని యనిపిన నజ్జననాథుండును నేమియుం బలుకవెఱచి యూరక వెడలె నప్పుడు.

613


క.

అచ్చపలాక్షు లతిత్వర
వచ్చి నివాసముల నిలువ వసుధేశ్వరుఁడున్
ఱిచ్చపడుమనముతో వెస
నచ్చటికి న్వచ్చి వారినందఱఁ జూచెన్.

614


తే.

చూచి మనమున మిక్కిలి చోద్యమంది
వార లొనరించు నతులోపచారసరణిఁ
దేలి తజ్జాలసంసక్తిఁ దెలియలేక
యధికతరమైన ప్రేమతో నాదరించె.

615


ఉ.

మానవనాథ యిట్టియభిమానధనుం డెఱుఁగంగఁజాలెనే
యానలినాయతాక్షులదురాచరణం బది యట్టులే సుమా
యేనరుఁడైన నిట్టి వెత లించుక యైన నెఱుంగఁ డింతటన్
మానసవీథిఁ జూచుకొనుమా యిఁకఁ దెల్పఁగ నేర మేమియున్.

616


తే.

అనుచు బాలసరస్వతీవనిత విక్ర
మర్కుతోఁ దెల్పెననుచు శుకాగ్రగణ్యుఁ
డలప్రభావతి కెఱిఁగించునంతలో శ
కుంతములు మేఁతలకుఁ దమగూళ్ళు వెడలె.

617


తే.

అంతటఁ బ్రభావతీకమలాయతాక్షి
యాత్మకేళీగృహంబున కరిగి నాఁటి
రేయి నృపుపొందుఁ గోరి చేరిన మనోజు
తేజి యిట్లను దియ్యనితేనె లొలుక.

618