పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

పాలవేకరి కదిరీపతికాలము

జాతివార్తారచనాచమత్కారవిలసితమును సరసకవితామనోహరమును నగు శుకసప్తతి యను ప్రశస్తప్రబంధమును రచియించిన కదిరీపతి చంద్రవంశక్షత్త్రియుఁడు. అచ్యుతగోత్రుఁడు. అనంతపురమండలమునఁగల కదిరి లేక ఖాద్రి రాజ్యమునకు నధినేత. ఖాద్రి యందు శ్రీ నరసింహస్వామి యీతని యిష్టదైవము. ఈతని వంశీయులలోఁ గూటస్థుఁడు ‘తాడిగోళ్ల’ అను గ్రామమున నివసించుటచే, నీతని తాతవఱకును గలనామముల ముందు ‘తాడిగోళ్ల’ అను పేరు వెలయుచుండెడిది. శుకసప్తతి గద్యనుఁ జూచిన నీవిషయము తెల్లమగును.

"ఇది శ్రీ మత్ఖాదిరీనృసింహకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధార పాలవేకరికులకలశాంభోధిసుధాకర తాడిగోళ్ళ కరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవివక్షణానుసంధాయక కదిరీపతినాయక ప్రణీతంబైన శుకసప్తతి యను మహాప్రబంధమునఁ బ్రథమాశ్వాసము."

కదిరీపతి [1]శుకసప్తతి కృత్యాదిని తన వంశక్రమము నిట్లు తెలిపియున్నాఁడు:—

  1. శుకసప్తతి తొలుత కాకినాడ బాలసరస్వతీముద్రాలయమున శ్రీ. శ. 1909 సంవత్సరమున ముద్రితమైనది. ఆకాలమున వెలువడిన సుప్రసిద్ధపత్త్రికలలో నెన్నఁదగిన 'శ్రీ సరస్వతి' పత్రిక యందు ప్రకటితమైనది. అందు కృత్యాది పద్యములను నాంధ్ర సాహిత్య పరిషత్తువారు క్రీ. శ. 1929 లో శుక్ల-చైత్ర వైశాఖి పరిషత్పత్త్రికలోఁ బ్రకటించినారు. కృత్యాదిపద్యములఁ బరిషత్తు ప్రకటింపకున్న చో నీరాజకవి చరిత్రము మన కీపాటియైన తెలియదు. కీర్తిశేషులు వీరేశలింగము పంతుల వారి కవిచరిత్ర రచనాకాలమున కివి యలభ్యము లగుటచే వారీ కవికాలనిర్ణయము చేయుట కనువుపడలేదని వ్రాయుట తటస్థించినది. కృత్యాదిపద్యములతోఁ గూడ నిప్పటి కాఱేండ్ల క్రిందట ననఁగా క్రీ. శ. 1935 సంవత్సరమున “వావిళ్ల” వారి శ్రీరామముద్రాలయమున నీగ్రంథ మభిరామముగ ముద్రితమైనది.