7
వివిధ ప్రతులలోఁ బరస్పరనిరోధములు చాలఁ గలవు. చరణములకుఁ జరణములే మార్పులుండుటచే నేది శుద్ధప్రతియో నిర్ణయించుట కష్టము.
హంసవింశతియును నిట్టి గ్రంథమే, చాలపద్యము లందు నిందును సరిపోలియుండుట చేత నొకదానిని గాంచి యొకటి వ్రాయఁబడిన ట్లెంచవలసియున్నది.
నే నీగ్రంథమును బరిప్కరించుటలో మిగులసమర్థతగల తెలుఁగుపండితుఁడగు శ్రీ జూలూరి అప్పయ్య గారిసహాయమును బొందియున్నాఁడను. అతఁడు మిగులజాగ్రత్తగను జయప్రదముగను నీ కార్యమును జరపినాఁడు. హంసవింశతిలో జాతీయపదములు విశేషముగా నీయఁబడియుండినను దానికంటె నీ గ్రంథమే రచనయందును మాధుర్యమునందును హెచ్చుగానున్న దని యాతఁడు తలంచుచున్నాఁడు.
అయినను నీ గ్రంథమున కీపేరు తగియుండ లేదని యాతఁడు తలంచియున్నాఁడు. అది సత్యము. దీనిని శుకసప్తతి యనుటకంటె శుకత్రింశతి యనఁదగునని నుడివినాఁడు. ఎందు చేతననఁగా గ్రంథము పూర్తి చేయఁబడి యుండ లేదు గనుక.
తెనుఁగులో శుకసప్తతియను నొకవచన కావ్య మంగడులలో దొరకునుగాని యిది దానినిబట్టి వ్రాసినపద్యకావ్యము కూడఁ గాదు.
1839సం॥ లో మఱికొన్ని యెక్కువ పద్యములుగల ప్రతి నొకదానిని సంపాదించినాఁడను.) అని దొరగారు వ్రాసి యున్నారు.