పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనిన ప్రహ్లాదుండు తండ్రి కి ట్లనియె.

533


గీ.

సకలజంతువులకు శాస్తయై పరమాత్మ, విష్ణుఁ డెపుడు హృదయవీథి నుండు
నతఁడు దప్ప జనుని కన్యుఁ డెవ్వండు శా, సకుఁడు కలఁడు దైత్యచంద్ర చెపుమ.

534


క.

అనుటయు దైత్యేశ్వరుఁ డి, ట్లను విష్ణుఁ డనంగ నెవ్వఁ డఖిలంబున కే
నొనరంగ నీశ్వరుండన్, నను మిగిలినవాఁడు గలిగినన్ జెప్పు మిలన్.

535


వ.

అనిన ప్రహ్లాదుం డిట్లనియె.

536


క.

యోగిధ్యేయ మదృశ్యం, బేగుణనిధిపరమపదము హెచ్చౌజగదా
భోగం బేవిభుకృతిచే, వేగున్ పరమేశుఁ డతఁడు విష్ణుఁడు తండ్రీ!

537


వ.

అనిన విని దైత్యేంద్రుం డిట్లనియె.

538


ఉ.

ఈవెడమాట లేల పరమేశ్వరుఁ డెవ్వఁడు నాకు మిక్కి లీ
భూవలయంబునన్ ముగిసిపోఁదలవెత్తిన నీకు నీశ్వరుం
డై వెలుగొందువాఁడు చపలాత్మక యెక్కడ నుండు వాఁడు వా
చావితథత్వ మేర్పడ నిజంబుగ నాకు నెఱుంగఁ జెప్పరా.

539


వ.

అనుటయు ప్రహ్లాదుండు

540


ఉ.

నామది నేల నీతలపునన్ భువనంబుల నిండియుండి ల
క్ష్మీమహిళామనోహరుఁ డమేయుఁడు సర్వగతుండు నిత్యకృ
త్యామితసర్వచేష్టితములందు నియుక్తులఁ జేయు నిట్టిచో
తా మొనరించినా మనుట తథ్యమె రాక్షసలోకనాయకా

541


వ.

అనుటయు.

542


గీ.

వెడలఁద్రోయుఁడు వీని నివ్వేళ గురుని, శిక్ష నిఁకనైన సద్బుద్ధి చేరునేమొ
శత్రుపక్షస్తవంబులు చదువు మనుచు, వీని నెవ్వరో వెఱ్ఱి తవ్వించినారు.

543


క.

అనునెడ దానవభటు ల, య్యనఘునిఁ దోడ్కొనుచు గురునియాలయమునకున్
చనుదెంచి రచటఁ జదివెన్, వినుతమహామహిమ నిఖిలవిద్యలు వరుసన్

544


మ.

మనుజాధీశ్వరుఁ డొక్కనాఁడు నవరత్నస్తంభశుంభద్విభా
ఘనసౌధాగ్రమునన్ మణీఖచితయోగ్యప్రస్ఫురత్పీఠిపై
నను వొంద న్వసియించి కొ ల్వొసఁగి దివ్యద్రాజసం బొప్పఁగాఁ
దను రప్పించి పఠించు శాస్త్ర మడుగన్ దైత్యార్భకుం డిట్లనున్.

545


క.

పురుషుండు ప్రకృతియును నీ, చరాచరాత్మకము నైనజగములు నగునే
పరమాత్మువలన నాశ్రీ, హరి మాకుఁ బ్రసన్నహృదయుఁ డయ్యెడు మనినన్.

546