పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

సింహికాభిధాన చెలియలు వారికి వెలఁదియొకతె గలిగె విప్రచిత్తి
యనెడిదైత్యపతికి వనితగా నిచ్చిన ప్రీతి నతఁడు దగఁ బరిగ్రహించె.

511


వ.

ఆహిరణ్యకశిపునకు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాద, సంహ్లాదులన నలుగురుపుత్రులు
వారిలోన.

512


క.

సమదర్శనుఁడు మహాత్ముం, డమలయశోనిధి గుణాఢ్యుఁడగు ప్రహ్లాదుం
డమితైకభక్తి నిలిపెన్, కమలాక్షునియందు నన్యకామరహితుఁడై.

513


సీ.

చల్లనై యుండె వైశ్వానరుఁ డంభోధి, మీఁగాలిబంటియై మీఱదయ్యె
శస్త్రాస్త్రజాలముల్ శకలీకృతము లయ్యె, విషధరదంష్ట్రిక ల్విఱిగిపోయె
పూబంతులై తాకె భూధరఘాతముల్, హంసతూలపుపాను పయ్యె ధరణి
మలయమారుత మయ్యె ప్రళయజంఝూనిలం బిభదంతములు పువ్వుటెత్తు లయ్యె


గీ.

విషము సుధ, కృత్య దాసియు వివిధ మాయ, లెల్ల మంచుగములు నయ్యె నిందిరాస
హాయుఁ దలఁచుచునున్న ప్రహ్లాదునకును, దండ్రి ఘనరోషభీషణోద్ధతి ఘటింప.

514


మ.

అనమైత్రేయుఁడు కేలుదోయి నిజఫాలాంతంబునం గూర్చి యి
ట్లను నోశక్తికుమార! పంకజదళాక్షాంఘ్రిద్వయీచింతనా
భినుతానందను నందనుం జనకుఁ డప్రేమాత్ముఁడై యేల యి
ట్లనిమి త్తంబుగ నొంచఁ బంచె నిది యాద్యంతంబునుం జెప్పవే.

515


క.

అనినఁ బరాశరముని యా, ఘనుఁ గని యను మును హిరణ్యకశిపుఁడు తప మ
త్యనుపమగతి మందరనగ, మునఁ జేసె దృఢప్రయత్నమున నిశ్చలుఁడై.

516


ఉ.

అక్కజమైనతత్తప ముదగ్రతఁ జూప విరించి యంచపై
వాక్కలకంఠిఁ గూడి యటు వచ్చి వియచ్చరు లెల్లఁ జూడఁగా
రక్కసుఁ డిచ్చఁ గోరిన వరంబు లొసంగి చనన్ దపోమదం
బెక్కి జగత్రయంబు నతఁ డేలె సురాసురమర్త్యజైత్రుఁడై.

517


సీ.

ఇంద్రుడై సురకోటి నేలు పావకమూర్తి, యయి కయికొను కవ్యహవ్యతతులు
దండియై ప్రాణుల దండించు కోణేశుఁడై, యాతుధానుల నాక్రమించు
యాదోధినాథుఁడై యాదోగణము నొంచు, పవనుఁడై వడకించు భువనచయము
ధనపతియై సర్వధనములు హరియించు, రుద్రుఁడై ద్రుగనలార్చులు నిగుడ్చు


గీ.

తపనుఁడై దుస్సహోగ్రసంతాప మొసఁగు, సోముఁడై భూమి నించు నుద్దామమహిమ
మేఘమై వర్షధారాసమృద్ధిఁ జూపు, ద్రుహిణవరమత్తుఁ డాజగద్ద్రోహి యసుర.

518


క.

సురలెల్ల బంట్లుగా న, చ్చరలెల్లం జేటికలుగ సకలధరిత్రీ
నరులెల్ల భక్ష్యములుగా, హిరణ్యకశిపుఁ డెల్లజగము లేలె బలియుఁడై.

519