పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బును నీవ, దైత్యనిర్జితులమై యార్తినొంది నిన్ను శరణంబు జొచ్చితిమి. నీ
తేజంబున మము నాప్యాయనంబు నొందించి రక్షింపుము.

210


క.

నిను గొలిచినపుడ తొలఁగున్, ఘనతరదుఃఖములు శుభము గల్గును పాపా
ఘనివృత్తి యగును వికసిత, వనజాయతనేత్ర భక్తవత్సలకృష్ణా.

211


క.

అని యిట్లు సురలు పలుకఁగ, వనజాయతలోచనుం డవారితకరుణా
వినుతకటాక్షేక్షణములఁ, దనియఁగ సురకోటిఁ జూచి తా ని ట్లనియెన్.

212


ఉ.

ఓసురలార నాదగుసమున్నతతేజముచేత మీకు ను
ల్లాసము చేయుదున్ గడునలంఘ్యము విప్రునిమాట తప్ప దా
యాసమనాక యోషధిచయం బఖిలంబును దెచ్చి వైచి ని
స్త్రాసమునన్ బయోజలధి ద్రచ్చుఁడు హెచ్చగు మీకు సంపదల్.

213


క.

మీరును దైత్యపతులు త, త్య్రారంభముతోడ మందరము మంథము స
ర్వోరగపతి వాసుకి త్రా, డారూఢిం జేసి చేయుఁ డబ్ధిమథనమున్.

214


సీ.

అసురల సామోక్తి నలరించి యమృతంబు మీకు సగంబని మేర చేసి
మత్సహాయత నబ్ధి మధియించి యమృతలాభము గాంచి యసురులఁ బరిహరించి
వినుతసుధాపానమున బలాఢ్యత మించి యమరత్వసిద్ధి నిత్యముగఁ గాంచి
శత్రువర్గముల వాంఛారూఢి నిర్జించి నిఖిలసంపదలఁ బూనిక వరించి


గీ.

యలరెదరు పొండు సురలార యనిన మ్రొక్కి, చని రమాపతి యాన తిచ్చినవిధమునఁ
క్షీరవారాశిలోన నక్షీణమహిమ, నోషధులు వైచి మథియించి రురుబలమున.

215


వ.

ఇట్లు మందరంబు కవ్వంబుగా వాసుకి నంకత్రాడుగా క్షీరాబ్ధి మధించు
నప్పుడు దేవతలు పుచ్ఛంబును దైత్యులు శిరంబును బట్టినప్పుడు విషదిగ్ధనిశ్వాస
వహ్నిచే నపహృతకాంతులై యసురులు నిస్తేజులైరి. తన్ముఖనిశ్వాసవాతా
హతిం దూలి వలాహకంబులు పుచ్ఛోపరిభాగంబునం బొగులు గట్టి వర్షింపం ద
ద్వర్షధారాప్యాయితశరీరులై సురలు బలసంపన్నులై యుండి రంత.

216


ఉ.

మందరభూధరంబు దధిమధ్య నిమగ్నము గాక యుండ గో
విందుడు క్రిందు కూర్మమయి వీపునఁ దాల్చి సురవ్రజంబు
నం దనుజాతిలోన గగనంబున నొక్కొకరూపు దాల్చి త
న్నందఱు గానకుండఁ గలశాబ్ధి మథించె నదృశ్యరూపుఁడై.

217


క.

సురలకు నసురలకును, నయ్యురగశ్రేష్ఠునకు పంకజోదరుఁ డొసఁగెన్
వరనిజతేజోబలవి, స్ఫురణమున ననూనబలము భూరివివేకా.

218