పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇదియే పురంబునకుం గొనిపోయి యరణి చేసి మథించి యిందు నుత్పన్నంబైన
యగ్ని నుపాసించెద"నని పురంబునకుం బోయి యరణినిర్మాణంబునకై గాయ
త్రిని బఠించిన గాయత్ర్యక్షరసంఖ్యాంగుళీప్రమాణంబులైన యరణి
త్రయంబైన నందు నగ్నిత్రయంబు మథియించి యూర్వశిసాలోక్యంబు
గోరి యామ్నాయానుసారియై వేల్చి గంధర్వలోకంబు నొంది యూర్వశిం
గూడి సుఖంబుండె. అగ్ని యొక్కం డయ్యును, నీమన్వంతరంబునఁ బురూరవునిచే
ద్రివిధంబై వికల్పింపంబడియెనని శ్రీపరాశరుండు మైత్రేయున కిట్లనియె.

258


క.

వరగురుఁడైన పురూరవు, చరితం బిది చెప్పితిం బ్రసన్నహృదయతా
స్ఫురితుఁడవై తద్వంశము, పరిపాటిని వినుము నిగమభవ్యాచారా.

259


వ.

పురూరవున కాయువు, ధీమంతుండు, నమావసుండు, విశ్వావసుండు, శ్రుతా
యువు, శతాయువు, నయుతాయువు నను నార్వురు పుత్రులు గలిగి రందు
నమావసునకు భీముండు, భీమునకుఁ గాంచనుండు, కాంచనునకు సుహో
త్రుండు, నతనికి జహ్నుండు పుట్టె.

260


సీ.

నుతకీర్తియైనజహ్నుఁడు పరస్మాత్పరు యజ్ఞపూరుషు కమలాధినాథుఁ
గుఱిచి యాగము చేయుతఱి రంగదుత్తుంగభంగపరంపరాభంగ యగుచు
గంగ తన్మఘవాటి గలయముంచినఁ జూచి కోపించి యారాజకుంజరుండు
పరమయోగిసమాధిపరతఁ దద్గంగాజలం బెల్లఁ ద్రావ నుల్లమునఁ దలఁకి


గీ.

మునులు చనుదెంచి యారాజముఖ్యు నధిక, వినయమున వేఁడి గంగ నీతనయ దీని
విడువుమని సన్నుతించిన విడిచె నృపతి, యదిమొదలు గంగ జాహ్నవి యనఁగఁ బరఁగె.

261


వ.

ఆజహ్నునకు సుమంతుండు, నతనికి నజకుండు, నతనికి బలాకాశ్వుండు, నతనికిఁ
గుశుండు, కుశునకుఁ గుశాంబకుశనాభాధూర్తరజోవసువులను నలుగురు
పుత్రులు గలిగిరి. అందుఁ గుశాంబుండు.

262


చ.

శతమఖతుల్యుఁడైన సుతుఁ జయ్యనఁ గాంచెద నంచుఁ గోరియున్
వ్రత మటు సేయ నింద్రుఁడు ధరావరుఁ జేరఁగవచ్చి నేన నీ
సతికిఁ దనూజభావమున జన్మము నొందెద నంచుఁ బోయె న
క్షతభుజవీర్యశౌర్యనిధి గాధి జనించెఁ గుశాంబుఁ డుబ్బఁగన్.

263


వ.

కుశాంబపుత్రుండైన గాధికి సత్యవతియను కన్యక పుట్టె, భృగువంశోత్త
రుండగు రుచికుండు వచ్చి యాసత్యవతి నడిగిన గాధి కోపించి.

264


గీ.

వృద్ధుఁ డీబ్రాహ్మణుండు సమృద్ధరూప, శీలసౌభాగ్యయైన యీచిగురుఁబోఁడి
నెవ్విధంబున నడిగె నె ట్లిచ్చువార, మైన నొకనేర్పు కలదని యతనిఁ జూచి.

265