పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చొక్కు మదిలోఁ దలంచుచు, రక్కెస చనుదేర హాస్యరసముగ నసిచే
ముక్కును జెవులును గోసె న, సృక్కణములు మోనువెంట జిలజిలఁ దొరగన్.

191


చ.

అరితతి వేఁటలాడు వసుధాధిపసూనుఁ డనల్పనైపుణీ
వరకరలాఘవంబున నవారణ నేయు విచిత్రపత్రి యా
ఖరముఖదైత్యనాథులను కైదుల బోరలు సించి క్రొవ్వు ని
ష్ఠురవరవిక్రమాప్తిఁ జవిచూచె గనుంగొనువారు మెచ్చఁగన్.

192


శా.

మారీచాంతకుఁడై కబంధవధశుంభత్సాయకుండై చమ
త్కారోత్ఖండితసప్తభూమిరుహుఁడై దర్పోజ్వలద్వాలిహృ
ద్ఘోరాద్రిప్రవిచారణోగ్రపవియై దుర్వారుఁడై యాసమి
చ్చూరాగ్రేసరుఁ డేలెఁ గింకరునిఁగా సుగ్రీవు నుగ్రాంశుజున్.

193


చ.

భవుకసితాబ్జపత్రరుచి పక్కున నవ్వు నృపాలువాలుఁగ
న్గవకొనకెం పొకించుగఁ దొగర్చఁగఁ దద్విశిఖాంచలంబునన్
దవిలెఁ బయోనిధాన మవధానముగాఁ దరుశాఖ నొప్పు కెం
జివురుతుద న్వసించు నొకచిన్నతుషారలవంబుచాడ్పునన్.

194


సీ.

స్నానకృత్యముఁ దీర్చె సంచరన్మకరాక్ష, రాక్షసోదరమహాస్రస్రవంతి
నాపోశనం బెత్తె నధికదృష్యత్కుంభ, కర్ణదీర్ణోర్వసృగర్జములను
ప్రాణాహుతులు వేల్చెఁ బటునిశాటభటప్ర, కాండచ్యవన్మాంసఖండములను
భోజనం బొనరించె భూరిరత్నకిరీట, కలితరావణశిరఃకబళములను


గీ.

సుఖశయన మొందె మణివిభాశోభమాన, మాననీయనిషంగధామంబునడుమ
ఎంత నిష్ఠాగరిష్ఠమో యినకులీన, చంద్రుబాడబసమదివ్యసాయకంబు.

195


వ.

ఇట్లు రావణవధంబు చేసి లంకారాజ్యంబున విభీషణునిఁ బట్టము గట్టి సీతాసమే
తుండై శ్రీరామవిభుం డయోధ్యానగరంబు ప్రవేశించి రాజ్యంబు పాలించె నంత.

196


గీ.

కడఁగి మూఁడుకోట్లు గంధర్వనాథుల, బాహుబలము మెఱయఁ బట్టి చంపి
వారిదేశములు బలారూఢిఁ గైకొనె, భరతుఁ డధికకీర్తిభరితుఁ డగుచు.

197


మ.

అరిజైత్రు న్మధుపుత్రకున్ లవణు మద్యద్బాహుసాహాయ్యకో
ద్ధురుఁడై యాహవకేళిఁ గీటణఁచి శత్రుఘ్నుండు గట్టించె భా
సురలీల న్మధురాఖ్యపట్టణము సంస్తుత్యంబుగా నందు సుం
దరసంపత్ప్రతిభాఢ్యులై జనులు సాంద్రప్రీతి వర్ధిల్లఁగన్.

198