పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సోమవిక్రేతలు శ్రుతిమానునాతండు, తల్లిదండ్రులఁ బ్రోవనొల్లనతఁడు
భ్రాతృపరిత్యాగి [1]సూతిపోష్టయు నింది, తుఁడు వృషలీపతిదూషకుండు


గీ.

కన్యకాదూషయితయు రోగస్థితుండు, దేవలకుఁడాది గల్గు భూదేవతలను
జెప్పఁగారాదు శ్రాద్ధంబు చేయుటకును, ధర్మశాస్త్రార్థవిదులు భూధరవరేణ్య

243


శ్రాద్ధంబునకుఁ దొలునాఁడ పితృదేవతార్థంబు శ్రోత్రియాదుల నిమంత్రింప
వలయు. అనిమంత్రితులైనను, యతుల భుజియింపఁజేయవలయు. నిమంత్రణా
నంతరంబున యజమానుండు విప్రులును గ్రోధవ్యవాయాయాసంబులు చేయ
రాదు. వ్యవాయంబులు చేసిన వారిపితరులు రేతోగర్తంబున మునుంగుదురు.
కావునఁ బ్రథమంబ నిమంత్రింపవలయు. స్నానంబు చేసి గృహంబునకు వచ్చిన
విప్రుల పాదప్రక్షాళనంబు చేసి యాసనంబులం గూర్చుండంబెట్టి పితలకు
నయుగ్మంబుగను దేవతలకు యుగ్మంబుగను నొక్కొక్కరినైనను యథేచ్ఛంబు
నుగా నియమింపవలయు. మాతామహశ్రాద్ధంబును నివ్విధంబుననె చేయ
వలయు. అందు వైశ్వదేవంబులు వికల్పం బనిరి. దేవతలకుఁ బ్రాఙ్ముఖంబును,
బితలకును దఙ్ముఖంబును బ్రశస్తంబు. దేవపితలకు శ్రాద్ధంబు వృథక్కరణం
బని కొందఱు చెప్పుదురు. కొంద ఱేకపాకంబునఁ గూడం జేయవలయునని
చెప్పుదురు.

244


గీ.

ధరణినాయక విష్టరార్థంబు దర్భ, సమితి యిడి పూజ చేసి శాస్త్రవిధి నర్ఘ్య
మిచ్చియావాహనము చేసి యెసఁగుభక్తిఁ, బితలకుఁను బ్రీతిసేయుట పెద్దమేలు

245


వ.

తదనంతరంబ దేవతల నిట్లు పూజింపవలయు. తిలాంబువులు పితరులకు, యవాం
బువులు దేవతలకు నర్ఘ్యం బీయవలయు. సగ్గంధధూపదీపాదు లిచ్చి సవ్యా
పసవ్యప్రకారంబులు దేవపితల నర్చింపవలయు.

246


క.

క్షితివర యక్కాలంబున, నతిథి యటకు నన్నకాంక్షియై వచ్చిన స
మ్మతి నతనిఁబూజ చేసిన, నతులితగతిఁ బొందు శ్రాద్ధ మానంత్యంబున్.

247


వ.

అతిథిని గడపిపుచ్చిన శ్రాద్ధంబు నిష్ఫలంబగు. అనంతరంబ విప్రులచేత ననుజ్ఞా
తుండై యగ్నియందు నాహుతిత్రయంబు యథావిధి వేల్చి హుతశేషం బల్ఫా
ల్పంబులగు పాత్రలయందుఁ బెట్టవలయు. తదనంతరంబ మృష్టంబును, నభీ
ష్టంబును, సంస్కృతంబును నగునన్నంబు పెట్టి “యథాసుఖం జుషధ్వ" మ్మని
యనిష్ఠురంబుగాఁ బలుకవలయు. విప్రులును దచ్చిత్తులై భుజియింపవలయు.
యజమానుండును రక్షోఘ్నమంత్ర పఠనంబు చేయుచుఁ దనపితల ధ్యానంబు
చేయవలయు. ఇట్లైనఁ బితృపితామహప్రపితామహులు తృప్తినొందుదురు. తద
నంతరంబ పిండప్రదానంబు చేయవలయు.

248
  1. సూతిపోష్ట — 'వృషలీసూతిపోష్ట' అని యుండనగును. శూద్రాపత్యపోషకుఁడని యర్థము.