పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రాభవంబులు మాలి బాహుశక్తులు దూలి పాఱువారును విధి దూఱువారు
మానుషంబులు గ్రాఁగి మత్సరంబులు వేఁగి వెచ్చువారును మూఁక విచ్చువారు
నై మహీధరమథితదుగ్ధాబ్ధిఘుమఘు, మార్భటీసహచారి హాహా మహాని
నాదములు చేయ విని పావకాదిదిక్పతులకు, జంభాసురారాతి సెలవు పెట్టె.

47


చ.

నిలిచి కనుంగొనంగ ధరణీధవసోదరుపై దిశాధినా
థులు చతురంగసైన్యములతోడ మృగేంద్రునిపై మదావళం
బులు చనుదెంచుకైవడి గముల్ గములై చనుదెంచి నెత్తుటం
వెలిచిరి తీవ్రసాయకహతిన్ రథవాజిభటద్విపంబులన్.

48


ఉ.

అవ్వడిఁ జూచి దుర్జయనృపాగ్రణికూరిమితమ్ముఁ డద్దిరా
క్రొవ్విరి వేల్పుబిడ్డ లని ఘోరశరంబులపాలు చేసినం
గుప్పలుగా రణాగ్రమునఁ గూలె గజంబులు మ్రొగ్గె వాహముల్
ద్రెవ్వె సితాతపత్రములు ద్రెళ్లె రథంబులు వ్రాలెఁ గేతువుల్.

49


గీ.

ఇవ్విధంబున సైన్యంబు లెల్లఁ జెల్ల, విఱిగి దిక్పతు లపకీర్తి వెంటవెంటఁ
దగిలి వచ్చినచందానఁ దలలు వీడఁ, బాఱిరి బలారిగుండియ భగ్గు మనఁగ.

50


క.

పాఱఁగ సుద్యుమ్నుఁడు మది, నాఱనికోపంబుతోడ నదలిచి వీఁపుల్
దూఱఁగ వేసెన్ ఫణిపతి, కోఱలఁ గ్రొవ్వాడి సరకుగొననిశరంబుల్.

51


వ.

ఆసమయంబునఁ బునఃపునరాహ్వానంబునం గరభ్రమితపరిధానంబున వీరరసాధ్య
క్షుండు సహస్రాక్షుండు సుద్యుమ్నవిద్యున్నిభకార్ముకనిర్ముక్తశరవిదారణభయఫ
లాయమానులం బావకాదిదిగధీశానుల నిలిపి సమరంబునకు నూలుకొలిపి వెలివారు
వంబు డిగ్గి పవనజిత్వరత్వరానైపథ్యరథ్యంబును మాతలిసారథ్యంబును వశీకృత
నిశీధినీచరవిజయమనోరథంబును నైనరథం బెక్కి పెక్కుదెఱంగుల వాద్యంబులు
మొరయ రయంబున విబుధవరూధినీసనాథుండై కవిసి విశిఖంబులవాన గురిసిన
విరిసిన సైన్యంబులం జూచి యేచినకోపంబునఁ జాపంబున గొనయంబు సంధించి
కవదొనలు బంధించి తురగదట్టరింఖాఘరట్టఘట్టితపరశిరఃకపాలుండు దుర్జయనృపా
లుండు తబలడమామికాపణవడిండిమడిమడిమధ్వానంబు జలనిధానంబు గప్పం
దలంప నలవి గానివాహినీనివహంబులు మున్నాడి నడవ మెఱుంగు మెఱచినచం
దంబున నిజస్యందనంబు మెఱయ నఱిముఱిం దఱియ నుఱికి వెఱచఱవం గసవు
గఱవ నఱవం బఱవ సంక్రందనబలంబులఁ జిందఱవందఱ సేయ నమ్మేటివిలుకాని
బాణంబు లనుచిచ్చరపిడుగులు వడిం బడిన గండమండలగళద్దానధారానిర్ఝరంబుల
తోడ వదనసందీప్తసిందూరధాతురాగంబులతోడ సముత్తుంగకుంభకూటంబులతోడ