30
రామాయణ విశేషములు
రతినిభ, శ్రీదమ యను తన తక్కిన మువ్వురుభార్యలతోడను శ్రీరాముడు సుఖముగా నుండెను. లక్ష్మణుడు తన యెనమండుగురు. భార్యలగు విశల్య, రూపావతి, వనమాల, కల్యమాలిక, రత్నమాలిక, జితపద్మ, భయవతి, మనోరమ యను వారితోడను వారి 25 మంది పుత్రులతోడను, పైగా తన 16 వేల యెక్కుడు భార్యల తోడను సుఖ ముగా నుండెను.
'లఘువిమర్శ
ఇది జైనరామాయణ కథాసారము. స్థలసంకోచముచే ఇంకను కొన్ని విషయములు పరిత్యక్తములయ్యెను. దీనివలన తెలిసికొనదగిన విషయములు కొన్ని గలవు. మనము జైన గ్రంథములు నవలోకనచేయుట అవసరము. మన మతమునకు విరుద్ధములయిన బౌద్ధ జైన చార్వాక లోకాయత సిద్ధాంతములను మనము పాషండమతముల పట్టీలోజేర్చి తదనుయాయులను నాస్తికులనియు, వేదవిరుద్ధులనియు వేదబాహ్యు లనియు నిందించి యుపేక్షాభావమును చూపినారము. అటుకాక వారి వాఙ్మయమును వారి జాతక కథలనుగూడా చదువవలెను.
ఈ జైనకథ వాల్మీకిరామాయణమునకు చాలభిన్నమైయున్నది. రాక్షసులకును, వానరులకును సంబంధ ముండెనని తెలియుచున్నది. సీత అయోనిజ కాదు. ఆమె తల్లిపేరు “విదేహ”. విదేహ కూతురు అయోనిజ యని మనవారు వర్ణించిరి. రాము డేకపత్నీ వ్రతుడుకాడు. రాముడోడించి నది అంతరంగమ యను మ్లేచ్ఛరాజును. అనగా అతడే పరశురాముడు. పర్ష్యావాడు. హనుమంతుడు నిత్యబ్రహ్మచారికాడు. రావణుడొక్క స్త్రీలోలత్వమున దక్కతక్కిన విషయములం దాదర్శప్రాయుడే. బహు రాజులకు స్త్రీ సంగతి నాటికిని నేటికిని మిక్కుటము. కాని రావణుడెన్ని చేసినను సీతాపచారకుడు కాకుండిన నిప్పటి యనేకవిటరాజులవలె, రాజ విటులవలె నిందాస్పదుడు కాకుండెడివాడు. అతడహింసా ప్రియుడు.