పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

35


స్వామి మొదలగు తిరుపతులనుండిఁ జనుదెంచు సురపతులు నిజని
వాసంబులకుఁ జని యరుణోదయంబున కరుగుదేర సేనాధిపతికి నానతి
యొసంగి ఠీవి మెఱయఁ గోవిలకు వేంచేసి విజయరాఘవమంటపంబున
నిలిచి వాహనంబులు డిగ్గి ప్రీతి దనర సేతియందు వేంచేసి సవరించు
వివిధోపచారంబు లవధరించి యిష్టవినోదంబుల సంతుష్టుఁ డై యుండు
సమయంబున విజయరాఘవవిభుండును నగరుఁ బ్రవేశించి యింతులుం
దాను నంతఃపురంబున సంతసంబున నుండె; నంత.

49


కాంతిమతి స్వప్నమున విజయరాఘవునితోఁ గలసి మోహపరవశ యగుట

క.

కాంతిమతి యిట్లు గనుఁగొని
యింతింతనరాని హర్ష మెసఁగఁగ మదిలో
నంతట నాసౌధము దిగెఁ
జెంతన్ బ్రియసఖులు చేరి చేలా గొసఁగన్.

50


తే.

ఇట్లు సౌధంబు డిగ్గి యాయిగురుఁబోణి
చెలుల బంతిని గూర్చుండి చెలువుమీర
నారగింపుచు వీడియం బమర సేసి
తూఁగుటుయ్యల శయనించె దొరతనమున.

51


సీ.

ఈరీతి నిద్రింప నారేయి వేఁకువ
        జామున నాయింతి స్వప్నమునను
విజయరాఘవమహీవిభుఁడు వేడుక వచ్చి
        శయ్యపై గూర్చుండి సరస మమర
నక్కునఁ దను జేర్చి చెక్కిలి నొక్కుచుఁ
        బుక్కిటి విడె మిచ్చి బుజ్జగించి
కురులు మెల్లనె దువ్వి కులుకుగుబ్బలమీఁద
        నందంబు గనుపించ గంద మలఁది


తే.

తావి గల్గిన తనదు కెమ్మోవి యాని
యే విజయరాఘవుఁడ నంచు నెలమిఁ బల్కి
చిగురువిల్తునికేళికిఁ జేరినపుడె
బాలికామణి యంతట మేలుకనియె.

52