Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముఁడు ద్రోణాద్రిప్రభం గాంచి యరుణోదయకాంతి యని శంకించి చింతించుట

క.

నగరాజధీర లక్ష్మణ, విగతస్నేహుండ వై వివేకింపక నన్
దిగనాడి నీకుఁ బోవఁగఁ, దగునే నా కేది దిక్కు తమ్ముఁడ చెపుమా.

1760


క.

రూపింప నెల్లవారికి, నేపారఁగఁ బ్రొద్దు వొడువ నీసమయమునన్
నాపాలఁ బ్రొద్దు గ్రుంకెను, భాపపుదుఃఖాబ్దిలోనఁ బడఁ బా లయితిన్.

1761


క.

నీరాక కెదురుచూచు చ, హోరాత్రము వగలఁ బొగిలి యుండుసుమిత్రం
జేరి యడుగ నే మనియెద, నేరీతి మొగంబుఁ జూతు నెక్కడఁ జొత్తున్.

1762


క.

భరతున కే మని చెప్పుదు, సరసుఁడు నీతమ్ముఁ డయిన శత్రుఘ్నునితో
నిరవుగ నేక్రియ బొంకుదు, గురుతరదుర్యశము నొంది కుందఁగ వలసెన్.

1763


తే.

అన్న దిగనాడి నను శర ణన్న నేను, లంకఁ బట్టము గట్టితి శంక మాను
మని విభీషణుఁ బలికితి నదియుఁ దప్పె, నిల నభాగ్యుల కెందును గలదె పెంపు.

1764


మ.

కమలాప్తుం డుదయాద్రిచేరువకు నిక్కం బారయన్ వచ్చె ని
త్తిమిరంబు విరియఁగఁ జొచ్చెఁ గలయన్ దిగ్భాగముల్ నిర్మల
త్వము వొందెన్ గ్రహతారకాతతులభాస్వత్స్పూర్తియుం దప్పె నే
నమరన్ లక్ష్మణువెంట నేఁగెద నసఃహ్యం బిచ్చటన్ నిల్వఁగన్.

1765


వ.

అని సుగ్రీవున కి ట్లనియె.

1766


ఉ.

బంధుఁడ వై తలిర్చుచు నపారబలీముఖసేనతోడుతన్
సింధువు గట్టి రక్కసులఁ జీరికిఁ [1]గోక వధించి తీవు నీ
బాంధవ మెల్లప్రొద్దుఁ దలఁపం డుగు నాత్మ మఱాకు మింకఁ గి
ష్కింధకుఁ బొమ్ము భానుసుత కీశబలంబులు నీవు నావుడున్.

1767


చ.

రవిసుతుఁ డంతయుం దెలిసి రాముని కి ట్లను భూమిపాలక
ప్రవర విచార మేమిటికిఁ బన్నుగ నాలవజాము సొచ్చె న
ప్పవనసుతుండు వచ్చు నరిభంజన శోకము మాను మింక నా
ప్లవగవరుండు వోవుపని పన్నుగ విశ్వసనీయమే కదా.

1768


వ.

అనినయనంతరంబ నిబిడప్రభామండలదుర్నిరీక్ష్యం డయి హనుమంతుండు
ప్రజ్వలన్మహౌషధీదీధితిభాసురం బగునాద్రోణనగంబు ధరియించి యేతెంచిన
నఖండచండతేజోమండలం బనఁ దేఱి చూడ రాకుండినఁ గపివీరులు భీతిల్లి పర
వశు లై యుండ రఘూద్వహుం డయ్యవసరంబున మార్తాండుం డని శంకించి.

1769


సీ.

ప్రలయకాలోదగ్రభగ్గుచండంబునఁ, గంటిమంటలు [2]మింటఁ గలయఁ బర్వ
రోమకూపంబుల భీమంబుగా విస్ఫు, లింగకణంబులు నింగి కెగయ
బ్రహ్మాండ మంతయు భగ్నంబుగాఁ జేయ, నప్పళించుతలంపు లుప్పతిలఁగ
నమరకులాధిపప్రముఖదిక్పాలుర, మసలక లీల భస్మంబు సేయఁ

  1. గోరక చంపి తీవు
  2. గూడి కలయఁ బెరుఁగ