పుట:భాస్కరరామాయణము.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బెక్కుదెఱంగులన్ వగల పెల్లునఁ దూలుచు నెట్టు లుండెనో.

40


ఉ.

ఏ జనకాత్మజన్ దశరథేశ్వరుకోడల రాముభార్యఁ జుం
డోజనులార యడ్డపడ రోసురలార సురారి కంచు నం
భోజదళాక్షి శైలవనభూములు దాఁటుచు భీతి నేఁగుచో
నీజలరాశిఁ జూచి మది నెంత దలంకెనొ యేమి సేయుదున్.

41


సీ.

వననిధి బంధించి చని లంక భేదించి, రాక్షసాధము పెన్నురంబు రయము
మెఱయ నందంద క్రొమ్మెఱుఁగునారసముల, గ్రుచ్చి యచ్చెరువారఁ గులిశఘోర
భల్లపరంపరల్ పరఁగించి ధనురాది, సాధనప్రకరంబు చక్కు చేసి
చేతులు ఖండించి శిరములు దునుమాడి, వెస నానిశోణితవృష్టిచేతఁ
బుత్రిదెసకుఁ బొగులు భూదేవియుడు కార్చి, తీవఁబోఁడి నెపుడు దెత్తునొక్కొ
చంద్రవదనవదనచంద్రిక నెన్నఁడు, దృక్ఛకోరతృష్ణఁ దీర్తునొక్కొ.

42


క.

తోయధివీచులకు నిశా, నాయకరోచులకు నడుమ నాతను వున్నం
గాయజతాపం బాఱుఁ జు, మీ యటఁ గొనిపొమ్ము నను సుమిత్రాపుత్రా.

43


వ.

అని పల్కి పురోభాగంబున.

44


క.

వలరాజు ఖడ్గపుత్రిక, జళిపించినతెఱఁగు దోఁపఁ జారులతాకో
మలపల్లవములు పొరిఁబొరిఁ, జలియించుటఁ జేసి విరహచకితుం డగుచున్.

45


క.

మంచానిలంబ నాపైఁ, బొందుగ సతిమీఁదఁ బొలసి పొలయుము నీచే
నొందుదుఁ దత్తనుసంగతి, చందురునం దెట్లు దృష్టిసంగతి గలుగున్.

46


క.

అని [1]కమ్మగాలి పొలపం, బునఁ దాలిమి దూలి పోవఁ బొవులుచు నున్నం
గని యవ్విభు నుచితోక్తుల, ననుజుఁడు బోధించె నంత నక్కడ లంకన్.

47

రావణుండు మంత్రులతో మంత్రాలోచనము సేయుట

తే.

వాసఐరాతి వేగులవారివలన, దాశరథులవృత్తాంత మంతయు నెఱింగి
పవనసుతుచేత నట్లైనపరిభవంబు, దలఁచికొనుచు నాస్థానంబు కలయఁ జూచి.

48


చ.

ఒకకపి సాగరంబు కడునుగ్రరయంబున దాఁటి వచ్చి స్రు
క్కక వన ముద్ధతిం బెఱికి కావలి యున్నిశాటకోటి న
క్షకుఁ బరిమార్చి మత్పురముఁ గాలిచి క్రమ్మఱ నేఁగె లెక్క సే
యక హరిసేనతో విడిసి రంబుధి దాఁటఁగ నిఫ్డు రాఘవుల్.

49


ఉ.

ఆవసుధేశు లింక మకరాలయ మేగతి నైన దాఁటి సు
గ్రీవపురస్సరంబుగ నొగిన్ నడతెంతురు తప్ప దాహవం
బేవెర వాచరించిన జయింతుము చెప్పుఁడు మీరు నీతివి
ద్యావిదులుం దలంపఁ బరమాప్తులు నా కని పల్కి వెండియున్.

50
  1. కమ్మదావిపొలపంబున