పుట:భాస్కరరామాయణము.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అని నీయగ్రజు వాలి నర్కసుత నే ర్పారంగ శాసించి తిం
క నశంకంబుగ సాధ్య మయ్యె రుమతోఁ గామోపభోగంబు ల
త్యనురాగంబునఁ బొందుచుం బ్లవగరాజ్యం బేలు దుఃఖించుచు
న్న ననుం దోడిసపత్నులం గని మదిన్ నందింప కాసక్తితోన్.

283


వ.

అని పలికి దుఃఖావేశంబున.

284


చ.

తనపతిపాదమూలమున దైన్యముతోఁ బడి తార యేడ్చుచున్
వనచరనాథ నీవెనుక వచ్చెదఁ బాయఁగఁ జాల నిన్ను నా
ఘనతరమాంసఖండములు కాకులు గ్రద్దలు జంబుకాదులుం
దనియ భుజింపఁ బ్రాణములు దద్దయు సమ్మతి నీకు నిచ్చెదన్.

285


చ.

తన ప్రియపుత్రుఁ డంగదుఁడు దైన్యము నొందఁగ డించి నాథుతో
ననుగమనంబు సేయు టిది యర్హము గా దని ప్రాకృతాంగనల్
కనుకని నాడ నిమ్ము చనఁగాఁ బతితోడిద నాకు లోక మ
త్యనుమతుఁ డైనఁ గాక ఖలుఁ డైనను నాథుఁడ లోక మింతికిన్.

286


క.

జనకునితో సోదరుతోఁ, దనయునితోఁ దాతతోడ దగుమైత్రిం జ
చ్చినసతికిం బతితోఁ జ, చ్చినగతిఁ గైవల్యపదము చెందం గలదే.

287


క.

జనని యొకయెగ్గు సేసినఁ, దనయుఁడు గోపించుఁ గాంత తనతోఁ గోపిం
చినఁ బ్రియపడుఁ బతి యిటు చె, ప్ప నిలన్ సతికిఁ బతిఁ బోలు బంధుఁడు గలఁడే.

288


వ.

అని పలికి తనభూషణంబులు పుచ్చి తొలంగవైచి యప్పుడు భూషణవిహీన యై
చంద్రునిం బాసిన శర్వరియంబోలె బాష్పసంరుద్ధనయన యై యుపరాగయుక్త
రోహిణియుంబోలె విలసిల్లి దివినుండి పడినట్లు నేలం ద్రెళ్లి పాంసుదూషిత
సర్వాంగి యై యొడ లెల్ల ధూళి బ్రుంగఁ బొరలి యేడ్చుచు మఱికొంతదడవు
నకు లేచి సుగ్రీవునిం జూచి యధికరోషావేశంబున.

289


క.

పతివధయ శస్త్రవధ నతి, కతివకుఁ బతి లేనిజీవ మది యేటికి నా
పతిఁ జంపితి నీచేఁ జ, చ్చితి నేనును నీవు బ్రదుకు సేమముతోడన్.

290


క.

అని తార పల్క లజ్జా,వనతాననుఁ డై మనంబు వందఁగ నిలఁ గ
న్గొనుచు మఱుమాట పలుకక, యినతనయుం డూరకుండె నెంతయు భీతిన్.

291


వ.

అప్పు డాతార వనచరస్త్రీలు బహువిధంబుల బోధింపఁ గొంత సహించి క్రమ్మఱ
దుఃఖం బెత్తి వాలి నాలింగనంబు చేసి యంతర్గతంబున.

292


క.

సంగతజాతాంగపరి, ష్వంగాంచితసుఖముకంటె శవ మై యి ట్లు
న్నం గాంతునియంగపరి, ష్వంగము గావించు టధికసౌఖ్యము నాకున్.

293


వ.

అని పలికి.

294


క.

నీమానము నీగుణములు, నీమన్ననతోడిచూపు నీమధురోక్తుల్
నీమందస్మితవదనము, నీమోహముఁ దలఁచి మనము నీఱుగఁ జొచ్చెన్.

295