పుట:పంచతంత్రి (భానుకవి).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


టకు గతం బెయ్యది? మందబుద్ధీ! నా కెఱింగింపుమనిన నాగార్దభం బిట్ల
నియె,—

53


క.

మృగరాజు నన్ను భక్షిం
పుగతిన్ డాసినను, బారిపోయితి ననినన్,
మృగధూర్తకపుంగవుఁ డొ
ప్పుగ దానిం బోలఁ జూచి పొందుగఁ బలికెన్.

54


వ.

గార్దభేశ్వరా! మృగరాజుసన్నిధిని నీగుణమ్ములు ఘనమ్ము
లుగా నే వర్ణించిన, నమ్మహాత్ముండు ప్రియపూర్వకంబుగా నిన్ను నాలింగ
నంబు సేయ డగ్గఱిన, నది నీ కవిరోధి యని యెఱుఁగనేరక, పారి వచ్చి
తివి. నష్టైటెశ్వర్యంబున కిది గడగుఱుతు గాదే! యని, వెండియు నిట్లనియె,—

55


క.

ధర మతిమంతులకైనన్
బరికింప శుభమ్ములందు బహువిఘ్నంబుల్
పొరయున్, దత్ర్పారంభము
కరము వెలయఁజేయవలయుఁ, గరణిక లక్ష్మా!

56


క.

అనిన మదిఁ బొంగి రాసభ
మనఘా!, నీవెంట వత్తు ననిన, నతఁడు ర
మ్మని వెసఁదోడ్కొని తనదు వి
భునిసాన్నిధ్యంబుఁ జేర్చె బుద్ధినిపుణతన్.

57


వ.

అయ్యవసరమ్మునం దనకోర్కె సఫలమ్ముఁ జేసిన జంబుకనాథుం
గౌఁగిలించుక యతనివాచాస్ఫూర్తికి మెచ్చి రాసభంబును దగ్గఱం బిలిచి
పంచత్వమ్ము నొందించి, జంబుకవరుం జూచి నిత్యకర్మం బాచరించి వచ్చి
యౌషధమ్ము సేవించెద, నే వచ్చునంతకు నీఖరశవంబు పదిలంబని చెప్పి
చనునంత,—

58


గీ.

ఎట్టి యౌషధంభొ! యిది మృగేంద్రుని పాలు
సేయ నేలయనుచుఁ, జేరి రాస
భంబు హృదయకర్ణభక్షణం బొనరించి
యుండె నెలమి జంబుకోత్తముండు.

59