పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సరమున కలఘుతృష్ణాభరంబున నేఁ డవారణ నీదారి వారణములు
పఱతెంచుచున్నవి పరికింపు మల్లవె కుందేళ్ళు వీని త్రొక్కుళ్ల మడిసె


తే.

ద్రాసకర మైనశశ ప్రళయమునకు, నకట యెబ్భంగి శాంతికార్యంబు దొరకు
నేమి సేయుదు ననువంత నెదుర నిలిచి, వివితనీతికళాశాలి విజయుఁ డనియె.

81


క.

దేవా నేఁ గలుగఁగఁ జిం, తావారిధి నేల మునిఁగెదవు శశములకుం
గావించెద శుభ మిభముల, రావిడువం జూడు నాపరాక్రమ మనుడున్.

82


క.

పలికె శశరాజు గాఢో, త్కలికన్నయనిధి దేశకాలవిభాగం
బులు నీక తెలియు నిట నీ, కలిమిఁ గ్రియాసిద్ధి యెట్లు గాలేకుండున్.

83


క.

ఆలస్య మకర్తవ్యము, కాలం భారంభమునకుఁ గరులమదరులన్
దోలి శశప్రాణంబులఁ, బాలింపుము నీయుపాయపాటన మమరన్.

84


క.

అని యాజ్ఞాపించిన నయ, వినయపరాక్రమనిధానవిజయుఁడు విజయుం
డనిలరయంబున నెదురుగఁ, జని యూధపు గాంచి మానసము గలఁగుటయున్.

85


క.

గజ మంటినట్ల యడచు, న్భుజగము మూర్కొనినయట్ల పొరిగొను ధరణీ
భుజుఁడు నగినట్ల చంపుం, గుజనుఁడు మన్నించునట్ల కొను బ్రాణంబుల్.

86


క.

కావునఁ గరినికటమునకుఁ, బోవం కార్యంబు గాదుపో యిపుడు మహా
భావనమున నుపకంఠ, గ్రావాగ్రం బెక్కి ముఖ్యకరిఁ బలికింతున్.

87


చ.

అని గిరి నెత్తమెక్కి శశ మగ్గజవల్లభుఁ జూచి యిట్లనుం
గనలున నీకు రాఁబొలము గా దిది నిల్నిలు చందమామ న
న్ననుపఁగ వచ్చితిం బయనమై యలజాబిలిలో శశంబుగా
మనమున న న్నెఱింగికొనుమా యన దంతివతంసుఁ డిట్లనున్.

88


క.

ఏమినిమిత్తము శశక, గ్రామణి ని న్నిటకుఁ బంపెఁ గైరసమిత్రుం
డామాట తేటపడఁ జెపు, మా మా కన విజయుఁ డగ్గజాగ్రణి కనియెన్.

89


క.

హేతులు పైఁబడునపుడున్, దూతలు సత్యంబుఁ బలుకుదురు తద్భాషా
వ్రాతమునకుఁ గలఁగరు ధా, త్రీతలవల్లభులు నగరు తెగ రెప్పటికిన్.

90


క.

అల నెల తనమాటలుగా, నెలవున నీతోడ నాడుమని న న్ననుపన్
దలమోఁచి చెప్పవచ్చితిఁ దెలియ న్విను యూధపక్షితిప యప్పలుకుల్.

91


ఉ.

చారువిచార యిక్కొలను చంద్రసరోవర మిందుఁ దారకా
ధారుఁడు చంద్రుఁ డిష్టవనితాజనతాయుతుఁడై యథేష్టసం
చారవినోదము ల్సలుపు సంతతమ న్విను మట్లుగాన సే
వ్వారికిఁ బోవరా దెఱుఁగవా యిట కిత్తెఱఁ గింతవింతయే.

92