పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈవాలు వచ్చి ఠేవం, జావంగా నున్నవారిఁ జంపెద రహితుల్
దేవా సంధి యనూనశు, భావహ మొనరింపు మస్మదాదేశమునన్.

20


వ.

అనుభాషితంబు లాకర్ణించి యధిపతి యాదీపి నడిగిన నతం డతని కభిముఖుండై.

21


క.

సంధికిఁ జను టె ట్లరులు ది, వాంధులు బలదుర్నిరీక్ష్యు లయ్యును దుస్సం
బంధ మిది గాదె మనము ని, శాంధుల మె ట్లమరు దూత కరుగం దిరుగన్.

22


క.

అటు గనుక సంధికార్యం, బెటువలె నొడఁగూడు రాత్రు లెదిరికి నెల వి
ప్పటికి మనకదను పగ లు, త్కటగతిఁ జని సంహరింపుదము పగవారిన్.

23


వ.

అని యుద్దీపి ప్రదీపి సందీపి యాదీపులు తమకుఁ దోఁచినట్లు చెప్పిన విని మేఘ
వర్ణుండు చిరజీవి నాలోకించి.

24


క.

ఈతం డితఁ డితఁ డీతఁడు, చేతోగతిఁ దోచినట్లు చెప్పిరి పథ్యం
బై తోఁపదు కించిత్తుం, దాతా నీ వేమి చెప్పెదవు నాతోడన్.

25


క.

నీసద్బుద్ధిబలంబునఁ, జేసెద రాజ్యంబు నేఁ డజేయదివాంధ
త్రాస ముదయించె నీ కిది, పోసమయము ప్రాప్తకాల ముపదేశింపన్.

26


క.

హరిపరిణామమునకు ని, ర్భరనీతిపరుండు గురుఁడుబలె నాభద్రం
బరయుటకు నీవెకా కె, వ్వరు నాఁ జీరజీవి మేఘవర్ణుని కనియెన్.

27


క.

అలఘునయవినయనిధు లీ, నలువురు విన్నపముఁ జేసినా రిమ్మతిమం
తులకంటెఁ గార్యనిశ్చయ, బలమున నధికుఁడనె యంతపాండితి గలదే.

28


ఆ.

వీరు నీకుఁ బరమవిశ్వాసఘటకులు, వీరినీతిరీతి వినుట యొప్పు
నైన నాకుఁ దోఁచినంతయు వినుపింతు, నేకతంబు వలయు నింతదడవు.

29


క.

హితుఁడని యొకనికిఁ జెప్పిన, నతఁడును దనకూర్చుసఖుని కది దెలుపు నర
క్షితమై నృపమంత్రం బీ, గతిఁ బలువురు వినుటచే విఘాతత నొందున్.

30


క.

అతిగుప్తమయ్యు మంత్రము, హితనితరశ్రుతముచేత నివురంబడు ని
క్కత యెఱిఁగి ప్రాంతజనసం, గతి రాజు రహస్య మొసఁగి కావఁగవలయున్.

31


వ.

అని యేకాంతంబు వడసి చిరజీవి మేఘవర్ణునకు సంధివిగ్రహయానాసనద్వైధీభావ
సమాశ్రయంబు లనుగుణంబులం ప్రారంభోపాయపురుషద్రవ్యసంపద్దేశకాలవిభాగ
వినిపాతప్రతికారంబు లనువమగంబుల సామదానభేదమాయోపాయంబు లనుచతు
రుపాయంబులఁ బ్రభుమంత్రోత్సాహశక్తుల విచారించి యం దుచితం బగుదాని
నంగీకరింపుము నాకుఁ దోచినకార్యం బొక్కటి ప్రతిపక్షు లుదగ్రసత్త్వద
క్షులు మనకు సమరసామర్థ్యంబు చాలదు దేశకాలంబులు విచారరమణీయంబులు.

32


క.

మీనొదవునంతకుం జనఁ, గానక బక ముండుకరణి ఘననీతిధనుం