పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శాంగనఁ జేరెనో యనఁగఁ నస్తగిరిన్ రవి చేరి క్రుంకినన్
నింగియు నేలయుం దమము నెక్కొన దిక్కులఁ గప్పె నొప్పులన్.

161


వ.

అయ్యంధకారంబున జిరంజీవి తాను మున్నున్నవటమహీరుహంబుక్రింద మృతకాక
మధ్యంబునం బడి రక్తంబునం దొప్పదోఁగి యెఱకలు విచ్చి నేత్రంబులు మూసికొని
మృతిం పొందినచందంబున డెందంబుకొందలం బడపుకొని యున్నసమయంబున
నక్కడ నుపమర్దనుండు తనమంత్రులం గనుంగొని యిట్లనియె.

162


గీ.

శత్రునిశ్శేషముగఁ జేసి చంపకున్న, నొకఁడు దప్పిన మన కది యొప్పకుండు
గాన వేగంబ యామఱ్ఱికడకుఁ బోయి, వెదకి చంపుట గార్య మీవేళ ననిన.

163


వ.

అప్పలుకు లాకర్ణించి యతనిమంత్రు లేకవాక్యంబుగా నిట్లనిరి.

164


ఉ.

దేవర నీతివాక్యము సుధీవిభవాఢ్యులు మెచ్చ నాడితౌ
పోవుట మేలు వాఁ గదలి పోయి వటం బరకట్టి చుట్టునుం
గావలి వెట్టి చొచ్చి యొకకాకముఁ గానక కాకు లన్నియున్
జీవములం దొఱంగె నని చెప్పఁగఁ గ్రమ్మఱి పోవునత్తఱిన్.

165


వ.

అవ్విధం బంతయు నెఱింగి చిరంజీవి తనలో నిట్లని వితర్కించె.

166


గీ.

మొనసి చేయవలయు మొదల నుద్యోగంబు, చేసెనేని కార్యసిద్ధిఁ బొందఁ
జేయవలయుఁ గానఁ జేసెద నని చిరం, జీవి నిశ్చయించి చింత దక్కి.

167


వ.

ఉన్న సమయంబున.

168


క.

కాకంబు లెల్ల మడిసెం, గా కిచ్చట నొకటి యైన గలిగెనె యనుచున్
గాకారు లరుగునంతట, నాకాకము కావు కావు మని యెలుఁగింపన్.

169


వ.

ఇట్లు గూసినచిరంజీవికూత విని యులూకంబులు పోక మగిడి వచ్చి యచ్చోటు
వెదకి చిరంజీవిఁ బట్టుకొని పోయి తమయేలిక యగునుపమర్దుముందటం బెట్టిన గనుం
గొని యతండు నీ వెవ్వఁడ వనిన నతండు నాపేరు చిరంజీవి యనుటయు నోరీ నీవు
మేఘవర్ణునకుఁ బ్రధానాగ్రగణ్యుండ వేతెఱంగున నిట్టివాఁడ వైతి వనిన జిరంజీవి
యతని కిట్లనియె.

170


సీ.

అవధరింపుఁడు నన్ను నమ్మేఘవర్ణుండు, దప్పక కార్యంబు చెప్పు మనిన
నుపమర్దభూపాలుఁ డుగ్రుండు సాహసి, యధికబలప్రతాపాన్వితుండు
సరగున మన మేఁగి శరణంబు చొచ్చిన, నతఁడు నీ కెంతయు హిత మొనర్చు
నని బుద్ధి చెప్పిన నతనిచిత్త మెఱింగి, యనుచరవర్గంబు లాగ్రహించి


గీ.

యోరి పగవారిపక్షమై నోరికొలఁది, నోడితివి దీనఁ జే టగుఁ గుడువు మనుచుఁ
జరణఘాతంబులను మేను చఱచి మట్టి, చంచుపుటములఁ గఱచి నొప్పించి చనిన.

171