పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ధర్మంబు పరమమిత్త్రుఁడు, ధర్మము వెనువెంట వచ్చుఁ దక్కినధనముల్
కర్మాయత్తశరీరము, నిర్మూలం బైనచోటనే వసియించున్.

138


గీ.

ఇట్టిమాట లెల్ల విని నిజంబులు గాని, యధమవృత్తిఁ గల్లలాడ నేను
గల్లలాడునట్టికష్టుఁ డెవ్వం డైన, మొనసి నరకకూపమున వసించు.

139


క.

తలఁప నహింసకు మిగులం, గలిగినధర్మంబు లేదు గావున నే నీ
తెలివిని దగ జీవాత్మం, దలఁపుచు నున్నాఁడ నొండు దలఁపనిబుద్ధిన్.

140


క.

పరభామఁ గన్నతల్లిఁగఁ, బరధనముం బెంకు గాఁగ భావింపుచు స
త్పురుషుండు సర్వజీవుల, నిరతముఁ దనయాత్మఁ గాఁగ నెమ్మదిఁ జూచున్.

141


గీ.

సకలభూతసమితి సౌఖ్యదుఃఖంబులు, తనవిగాఁ దలంచుతత్త్వవిదుఁడు
జన్మమృత్యుభయవిచారంబు దిగఁ ద్రోచి, లలితగతిని మోక్షలక్ష్మిఁ జెందు.

142


వ.

అట్లు గావున.

143


గీ.

ఎవ్వరికి హింస చేయక హితము చేసి, నాఁడునాఁటికిఁ జాంద్రాయణవ్రతంబు
సలుపుచున్నాఁడ నాతపోబలము కలిమి, నడుగుఁ డేమైవఁ జెప్పుదు నభిమతములు.

144


క.

అని తమ్ము నమ్మఁ బలికిన, విని వెఱవక చేరఁ బోవ వేగమె రెంటిన్
మునుగాళ్ల నడఁచి వానిన్, దినియెన్ గ్రూరాత్ము సమ్మతింతురె యెందున్.

145


వ.

కావున నీయల్పుండు రాజ్యార్హుండు గాఁ డని యావృద్ధకాకంబు పలికినం బక్షులు
విని యిది నిజంబు పలికేం దప్ప దని యాయులూకంబును రాజ్యాభిషేకంబునకుం
దొలఁగించి పక్షు లయ్యైదిక్కులకుం జెదరిపోయినఁ దదనంతరంబ యయ్యులూకంబు
వృద్ధకాకంబుకడకుఁ జనుదెంచి రోషసంరక్తలోచనంబులు మెఱయ నుద్ధతం బగుచు
నిట్లనియె.

146


క.

నీ కేమికీడు చేసితిఁ, గాకమ రాజ్యార్హుఁ డితఁడు గాఁ డని నన్నున్
గైకొనక పలికి తల్పుఁడ, నై కానంబడినభావ మది యెయ్యదియో.

147


వ.

అని మఱియు నిట్లనియె.

148


సీ.

తొడరి వాఁడిశరంబు దూఱి పాఱినగంటి, మంత్రౌషధంబుల మాన నేర్చుఁ
బరశుఖండితమహాపాదపోన్నతశాఖ, జిగి మించఁ గ్రమ్మఱఁ జిగురు వెట్టు
దర్పితభయదోగ్రదావాగ్నిశిఖలచే, మాడినతృణ మెల్ల మగుడ మొలచు
నిష్ఠురోక్తులచేత నెఱిఁ జెడ్డకార్యంబు, మగుడ నెన్నండును నిగుడకుండుఁ


గీ.

గాన నాకుఁ బక్షిగణము లనుష్ఠించు, ప్రాభవంబు చెఱుపఁబడియెఁ గాన
నోరి మీకు మాకు వైరంబు వాటిల్లె, ననుచు గూబ చనియె నాగ్రహమున.

149


వ.

అదియ కారణంబుగా నులూకంబులకుఁ గాకంబులకు సహజవైరంబు వాటిల్లె నని
చిరంజీని చెప్పి మఱియు నిట్లనియె. దేవా మును చెప్పంబడినషాడ్గుణ్యంబులలోన