పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

మిత్త్రమందర నీసుచరిత్రమహిమ, మఖిలజనులకుఁ గొనియాడ నాస్పదంబు
గాన నాకును సంతోషకరము గాదె, నిన్నుఁ గనుగొన్న నాభాగ్య మెన్న నేల.

164


ఉ.

ఉన్నతుఁ డైనమానవున కొక్కయెడన్ గడుఁ గీడు వొందినన్
సన్నపువాఁడు దీర్చుటకు శక్తుఁడె యంతటివాఁడు వాఁడు గా
కన్నునఁ బంకమగ్న మగునట్టిగజేంద్రుని నెత్త నేనుఁగుల్
పన్నుగ నోపుఁ గాక మృగపంక్తులు హీనము లంత కోపునే.

165


ఉ.

దేవబలాఢ్యుఁ డైనతఁడు ధీరమతుల్ కొనియాడ నొక్కచో
దైవిక మైనకీడు దనుఁ దాఁకిన నోర్చి సమస్తకార్యసం
భావితబుద్ధిమైఁ బ్రకృతిబాంధవు లాపదఁ బొంది వచ్చినన్
జేవ దలిర్ప వారలకుఁ జెందినదుఃఖము మాన్చు నెయ్యుఁడై.

166


చ.

పరువడి నెల్లనాఁడు బుధబాంధవకోటి నుతింప నుండువాఁ
డరుదుగఁ దన్నుఁ జేరుశరణార్థుల నర్థులఁ జింతితార్థసం
భరితులఁ జేయువాఁడు కులపావనుఁడై పెనుపొందువాఁడు పో
పురుషవరేణ్యుఁ డాయమరపూజ్యుఁడు కారణజన్ముఁ డీమహిన్.

167


వ.

అని మఱియును.

168


ఉ.

మారుతముల్ వనంబులను మానుగ షట్పదపంక్తి పువ్వులన్
హారవిహారిచారుకలహంసము లంబులఁ బక్షు లంబరా
ధారము గోరినట్లు ప్రమదంబుగ నేనును నిన్నుఁ జూడఁగాఁ
కారణ మౌటఁజేసి ఫలకాంక్షలఁ జేరితి మివ్విధంబునన్.

169


వ.

అని యిట్లు మిత్త్రమందరలఘుపతనహిరణ్యకులు తమలోపల సంభాషణంబులఁ
బ్రొద్దుపుచ్చుసమయంబున.

170


క.

సారంగ మొకటి మృగయుని, బారిం బొరిఁ దప్పి బెదరి భయవిహ్వలతన్
గూరి పఱతెంచినంతటఁ, జేరువఁ బొడగాంచి వారు చిడిముడిపడుచున్.

171


వ.

మిత్త్రమందరలఘుపతనహిరణ్యకులు మృగంబు తీవ్రగమనంబు చూచి వెఱచుచుఁ
గనికనింబఱచి రందు లఘుపతనం డచ్చేరువ నొక్కమహీరుహం బెక్కి భయంబు
దక్కి నిక్కి చూచి యామృగంబుపజ్జఁ దక్కినక్రూరమృగవ్యాధబాధలు లేకుండ
నిరీక్షించి మిత్త్రమందరహిరణ్యకులం బేర్కొని వెఱవక రం డని పిలిచిన నయ్యిరు
వురు వృక్షంబుపొంతకుం జనుదెంచి నితాంతభయభ్రాంతుండును గంపితశరీరుం
డును నగుచిత్రాంగదుం డనుమృగసత్తము నాలోకించి వారలలో మిత్త్రమందరుం
డమందానందకందళితహృదయారవిందుం డగుచు నామృగంబున కిట్లనియె.

172