పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఎవరి కెవ్వరి కేభంగి నెట్లు పొసఁగు, నట్టివారికి మైత్రి దా నమరుఁ గాక
నాశరీరంబు నీకు నన్నంబు నీవు, భోక్త వటు గానఁ జెలిమికిఁ బొందు గాదు.

32


వ.

 అనిన విని లఘుపతనుం డిట్లనియె.

33


క.

నీదేహము నా కశనము, గా దో పుణ్యాత్మ యిట్టికష్టుఁడ నే
మ్మేదినిఁ జిత్రగ్రీవుని, నీదగు సఖ్యంబువోలె నెఱపుము నెమ్మిన్.

34


క.

రోయక నిను భక్షించిన, నాయాఁకలి దీఱఁ జాలునా యనుమానం
బీయెడ వల దిటు చేకొన, నాయము నన్నుం గపోతనాయకు భంగిన్.

35


క.

ఎందును దిర్యగ్జంతువు, లందును దగు సమయనిశ్చయంబును హితముం
బొందుపడుట దృష్టం బిది, వింద వయినవినుఁ గపోతవిభునిం జూడన్.

36


వ.

అని లఘుపతనుండు మఱియు నిట్లనియె.

37


ఉ.

ఓర్వక దుర్జనుండు కఠినోక్తుల సజ్జనుఁ బల్కె నేని ని
గ్గర్వుఁడు గాని యాతఁడు విచారము నొందఁ డొకింతయేని తా
నౌర్వశిఖిం గలంగనిమహాబ్ధిజలంబు తృణాగ్ని వైచినన్
దుర్వహదుఃఖభార మయి తోడనె తాపముఁ బొంద నేర్చునే.

38


వ.

అనిన హిరణ్యకుం డిట్లనియె.

39


గీ.

చపలమతివి నీవు చాల నమ్మినవారి, నెలమిఁ బ్రోచుశక్తి యెట్లు గలుగుఁ
జంచలుండు చెఱుచు సకలకార్యంబులు, గాన నీకు నాకుఁ గాదు పొందు.

40


వ.

అనిన లఘుపతనుం డిట్లనియె.

41


ఉ.

ఏ నటువంటివాఁడ నని యీవిరసోక్తులు పల్క నేటికిన్
మానుము లోనిశంక బహుమానపురస్సర మైనమిత్త్రసం
ధాన మవశ్యకార్యముగఁ దత్పరతం దగఁ జేయు నాయెడం
గాని గుణంబు లెన్నకు మొకానొకవేళను నోహిరణ్యకా.

42


వ.

అనిన నతం డిట్లనియె.

43


గీ.

నీకు నాకును శాత్రవనియతధర్మ, మైననడవడి వర్తిల్లు నాత్మయందుఁ
గల్మషము లేని మైత్త్రి దాఁ గలుగు టెట్టు, గానఁ జెప్పంగ నదియు యుక్తంబు గాదు.

44


గీ.

బుద్ధిమంతుఁ డైన పురుషుండు దనశత్రు, హితుఁ డటంచుఁ జేర నిచ్చి చెడును
దప్తజలముచేతఁ దడిసినయగ్ని దా, హీన మగుచు శమితమైన కరణి.

45


వ.

అని మఱియును.

46


క.

విను శక్య మైన కార్యము, చనుఁ జేయ నశక్య మైనఁ జనునే చేయన్
వననిధిపై శకటంబును, నొనరంగా మిట్టనేల నోడయుఁ జనునే.

47