రేకు: 0253-05 గుజ్జరి సం: 03-306 వైరాగ్య చింత
పల్లవి : |
ఇతని మఱచితిమి యెదుటనే యుండఁగ యిన్నాళ్లును నే మెరఁగక
ప్రతిలేదితనికి జీవకోట్లకుఁ బ్రాణబంధుఁ డితఁడు
|
|
చ. 1: |
ముందు నేను ఘనగర్బనరకమున మునిఁగియున్ననాఁడు
బొందితోడనే సుఖదుఃఖంబులఁ బొరయు తోడునీడితఁడు
అంది స్వర్గనరకాదులు చొచ్చిన అక్కడఁ దా వెనువెంటనే
చందపు నాయాతుమలోఁ బాయని సర్వాత్మకుఁ డితడే
|
|
చ. 2: |
ఆని పట్టి నేఁ బాపపుణ్యములు అనుభవించవలెనన్నప్పుడు
మానుపనొల్లఁడు తాఁ బెరరేఁచును మతి కనుకూలం బితఁడు
నానావిధులనుఁ బొరలి యలపుతో నలి నే నిద్రించేటప్పుడు
తానును ఆపరిణామంబులకు తగులైవుండును యీతఁడు
|
|
చ. 3: |
తలఁచిన దగ్గరుఁ దడవక యుండిన దవ్వయివుండు నితఁడు
కలసి మెలసి ఇహపరము లొసంగఁగఁ గాచుకవుండును యీతఁడు
మెలఁగుచు సాకారముతో నున్నాఁడు మేటిశ్రీవేంకటపతి యీతఁడు
వలసిన వావులరూపులు దాల్చినవాఁ డొకఁడేపో యీతఁడు
|
|