పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0253-05 గుజ్జరి సం: 03-306 వైరాగ్య చింత


పల్లవి :

ఇతని మఱచితిమి యెదుటనే యుండఁగ యిన్నాళ్లును నే మెరఁగక
ప్రతిలేదితనికి జీవకోట్లకుఁ బ్రాణబంధుఁ డితఁడు


చ. 1:

ముందు నేను ఘనగర్బనరకమున మునిఁగియున్ననాఁడు
బొందితోడనే సుఖదుఃఖంబులఁ బొరయు తోడునీడితఁడు
అంది స్వర్గనరకాదులు చొచ్చిన అక్కడఁ దా వెనువెంటనే
చందపు నాయాతుమలోఁ బాయని సర్వాత్మకుఁ డితడే


చ. 2:

ఆని పట్టి నేఁ బాపపుణ్యములు అనుభవించవలెనన్నప్పుడు
మానుపనొల్లఁడు తాఁ బెరరేఁచును మతి కనుకూలం బితఁడు
నానావిధులనుఁ బొరలి యలపుతో నలి నే నిద్రించేటప్పుడు
తానును ఆపరిణామంబులకు తగులైవుండును యీతఁడు


చ. 3:

తలఁచిన దగ్గరుఁ దడవక యుండిన దవ్వయివుండు నితఁడు
కలసి మెలసి ఇహపరము లొసంగఁగఁ గాచుకవుండును యీతఁడు
మెలఁగుచు సాకారముతో నున్నాఁడు మేటిశ్రీవేంకటపతి యీతఁడు
వలసిన వావులరూపులు దాల్చినవాఁ డొకఁడేపో యీతఁడు