పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

బలిమిని రచ్చలోఁ గినిసి భాగ్యము గల్గినవాఁడు దబ్బఱల్
పలికిన నిక్కమండ్రు, మఱి భాగ్యముఁ గాననివారు నిక్కమున్
పలికిన దబ్బఱందు, రిటువంటిది కల్మి ధరిత్రి మీఁదటన్,
కులమున మిండఁడాయెఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

75

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఇహలోకంలో కలిమికి గల ప్రాముఖ్యాన్ని తమకు విన్నవిస్తున్నాను; కృపతో చిత్తగించు!

సంపద గలవాడు సభలో ప్రవేశించి, గట్టిగా అబద్ధాలు మాట్లాడినా, అవన్నీ నిజాలని ఎల్లరూ వాకొంటారు. మఱి నిఱుపేద యైనవాడు సత్యమే పలికినప్పటికీ, అది అసత్యమని అందరూ ఏకగ్రీవంగా అంటారు. కాబట్టి, ఈ భూమిపై (ఈలోకంలో) కలిమికి ఇంతటి బలిమి నెలకొనివుంది. మొత్తంమీద, ఈ ప్రపంచంలో కలిమి గలవాడే ఉత్తమ కులస్థుడుగా పరిగణింపబడుతూవుంటాడు. (ఇహలోకంలో కలిమికి గల బలిమి ఇంత గొప్పదని తాత్పర్యం).