పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

తల్లికిఁ గాని బిడ్డలును, దైవము నెంచని మర్త్యకోటులున్,
చుల్లరబుద్ధితోడఁ బరసుందరిఁ గోరుచునుండువారలున్
తల్లడమంది నాఁటికినిఁ దప్పక యా యమధర్మరాజుచేఁ
గొల్లకుఁ బోవువారు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

96

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనరసింహదేవా! ఆలకించు! కని పెంచిన తల్లిని సరిగా చూడని కుమారులూ, భగవద్ భక్తిలేక, భగవంతుణ్ణి లక్ష్యపెట్టక జీవించే మానవులూ, పోతరించిన పందులవలె మదించియుండి, కామంతో పరస్త్రీలను సదా కాంక్షిస్తూ వుండేవాళ్లూ- ఒకనాటికి - అనగా, అంత్యదశలో - నరకాధిపతియైన యమధర్మరాజుచేత వాళ్లు చేసిన ఆ యా పాపకార్యాలకు అనుగుణంగా నిర్దాక్షిణ్యంగా శిక్షింపబడుతారు. (తల్లిదండ్రులను ఆదరించడం, దైవాన్ని ఆరాధించడం, పరస్త్రీ వైముఖ్యం - మున్నుగాగల సత్ప్రవర్తనలమూలంగా మనుజుడు పుణ్యాన్ని గడించాలనేది సందేశసారాంశం.)