పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఎవ్వరు లేరు జీవునికి, నెవ్వరు శత్రువు? లెవ్వ రాప్తులున్
ఎవ్వరు నిందసేయుదురు? ఎవ్వరు మెచ్చుదు రెన్నిభంగులన్?
ఎవ్వరియందు సంతతము నేర్పడ జీవుఁడు నిండియుండుఁ; దాఁ
గ్రొవ్వును, భేదమేల? తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

94

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! చిత్తగింపుము! ఎన్నిరీతుల ఆలోచించి చూచినా, ఈ జీవుడే అందరిలోనూ నిండియున్నాడు గనుక, ఈ జీవునికి ఎవరూ శత్రువులు కారు; ఎవరూ మిత్రులు కారు. అలాగే, ఈ జీవుణ్ణి నిందించేవారుగానీ, ప్రశంసించేవారు గానీ ఎవ్వరూ లేరు. యథార్థ మిదిగా ఉండగా, ఒక్కొక్క మనుష్యుడు “నీవు నేను”- అనే భేదభావంతో అహంకరించి, సతమతం అవుతూవుండడం దేనికి? (తత్త్వం ఎఱిగిన జ్ఞానికి సర్వం భగవత్ స్వరూపమే కాబట్టి, అలాంటి భేదభావన తగదని తాత్పర్యం.)