Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యయప్రయాసములు గణింపక యి ట్లనేకసంస్కృతాంధ్రగ్రంథములను నిర్దుష్టములుగను, మనోహరములుగను ముద్రింపించి ప్రకటించుచుఁ జిరకాలమునుండి యుభయభాషాసేవ చేయుచున్న వావిళ్లవారి కాంధ్రులెల్లరును గృతజ్ఞులుగాకయుండరు.

ఈచిత్రభారతమును రచియించినకవి చరికొండ ధర్మన్న. ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. కౌండిన్యసగోత్రుఁడు. తిమ్మనామాత్యునకును, మాదమ్మకును బుత్త్రుఁడు. వైష్ణవభక్తుఁడు. శతలేఖినీసురత్రాణబిరుదకలితుఁడు. ఈవిషయములన్నియును గ్రంథకర్తయే యీ క్రిందిపద్యమున నిట్లు చెప్పుకొనియున్నాఁడు—

సీ.

కౌండిన్యగోత్రదుగ్ధసముద్రచంద్రు నా
             పస్తంబసూత్రశోభనగరిష్ఠు
సర్వవిద్యాభిజ్ఞుఁ జరికొండ తిమ్మనా
             మాత్యాగ్రణికి మాదమకును గూర్మి
నందను నతిశాంతు నారాయణధ్యాన
             తత్పరు శ్రీరంగధామసదృశ
భట్టపరాశరప్రభురంగగురుపాద
             నీరేజబంభరు నిర్మలాత్ము


తే.

ధర్మనాహ్వయు సత్కవితాధురీణు
దాంతు శతలేఖనీసురత్రాణబిరుద
కలితు నను వేడ్కఁ బిలిపించి గారవించి
తేనియలు చిల్క నిట్లని యానతిచ్చె.