పుట:కాశీమజిలీకథలు -07.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

సప్తమభాగము

నూఱవ మజిలీ

క. శ్రీకాశీనగరాధీశాః
    కారుణ్యాంబుధీ! నిశాకరవర
    లేఖాకల్ప భక్తకల్ప
    శుభాకర! గౌరీశ! పాపహర! విశ్వేశా!

మహాత్మా అవధరింపుమట్లు మణిసిద్ధ యతీంద్రుండు ప్రబుద్ధ స్వాంతుఁడగు నంతేవాసితో గూడఁ నూఱవ మజిలీ చేరి విహితక్రియా కలాపములం దీర్చికొని గ్రామ విశేషములం జూడనఱిగిన శిష్యునిజాడ నరయుచున్నంత అగ్గోపకుమారుం డూర్పుల డర నొకదెసనుండి పరుగిడి కొనివచ్చి యమ్మహాత్ము నడుగుదమ్ములం బడి గురువర్యా ! అల్లనాఁడు పండితరాయలు లవంగితోఁగూడ గంగాతరంగిణి యందైక్యమై పూర్వ దేహము ధరించెనని చెప్పితిరి. వారి పూర్వవృత్తాంత మెట్టిదని నేనడుగ “ఇప్పుడు చెప్పుటకు వీలులేదు. ముందెందైనఁ గరచరణ విశిష్టుండగు నిందుధరుమూర్తి గల శివాలయము గనంబడిన చోట జ్ఞాపకము సేయుము. దానికట్టి కారణమున్న" దని యానతిచ్చిరి గదా! అట్టిశివాలయ మీవీఁటం బొడఁగంటిని, పంచముఖుడైన యాదేవు నారాధించి వచ్చితి. పండితరాయల పూర్వవృత్తాంత మిప్పుడు చెప్పక తప్పదని గట్టిగా నిర్బంధించుటయు నయ్యతిపతి మందహాసము గావింపుచు నాత్మీయదివ్య మణిప్రభావ విదితోదంతుఁడై యుత్సుకత్వముతో వత్సా ! కృతజ్ఞతా గుణవిశేషంబునం గలుగు సుకృతంబును భీష్ముని పూర్వోత్తర జన్మ వృత్తాంతము నిందు దెల్లంబుగాఁ గలవు. అవహితుండవై యాకర్ణింపుము.

_____________