పుట:కాశీమజిలీకథలు -01.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అప్పు డారాజు చిత్త మెట్లుండునో వర్ణింప నశక్యముగదా! శోకమును రోషమును లజ్జయు పశ్చాత్తాపము నొక్కసారి యతనిచిత్తమునం జనించి యుత్తలపెట్ట దొడంగిన నేమియుం జేయఁదోచక బుద్ధిసాగరుని పాదంబులంబడి, మహాత్మా! ని న్నూరక నిందించి శిక్షఁజేయబూనిన నా పాతకమునకు నిర్వృత్తి యెద్దీ? నీవు కటాక్షింపనినాఁడు నాకు మరణమేకాని వేరులేదు. ఈ దుర్మార్గురాలి నిప్పుడే యుప్పుపాతర వేయించెద. నీవు మాత్రము నాయందు ప్రసన్నుఁడవు గమ్మని యనేక విధంబుల వేడికొనియెను.

బుద్ధీసాగరుండు శ్రీరంగరాజును బాదంబులనుండి లేవనెత్తి రాజా! నీ విషయమై నాకుఁ గొంచెమేనియుఁ గోపములేదు. ఇదంతయు మా దినముల మహిమయే కాని వేరుకాదు. ఒకరి ననిన లాభమేమి యున్నది? బ్రహ్మకైనను నెల్లకాల మొక్కరీతిగా వెళ్ళదుగదా? నీవేమియుఁ జింతింపవలసిన పనిలేదు. పద్మావతిని దండించినఁ గామపాలుండు బ్రతుకునా? కావున నెవ్వరి నేమియు జేయకుము నాకు నా మిత్రుని కళేబర మొకపెట్టెలో నమర్చి యిప్పింపుము. అది దీసికొని నేను తీర్థయాత్రలకుఁ బోయెదనని పలికిన నా రాజు అతని యిష్టప్రకారము కామపాలుని శరీరము చెడకుండఁ దైలము రాసి సరిపడిన పెట్టె చేయించి యందులో నా మొండెమునుంచి యది బుద్ధిసాగరుని కిచ్చెను. దానిని నెత్తిమీఁద బెట్టుకొని మోసికొని పోవుచుఁ దన భార్యచర్య లెట్లున్నవో చూచెదఁగాక యని తలంచి యటనుండి కొన్నిదినముల కత్తవారింటి కరిగెను

పిమ్మట శ్రీరంగరాజు బంధువు లెంద రెన్ని చెప్పినను వినక నామేదరివానితోఁడ బద్మావతిం జంపించి యుప్పుపాతర వైచి యా యపకీర్తి భీతిచేతనే కృశించి కొంతకాలములోనే పరలోక మలంకరించెను.

సుగుణావతి కథ

బుద్ధిసాగరుం డత్తవారింటికిఁ బోయినతోడనే మామగారు మిగుల సంతసించుచుఁ దగిన సత్కారము చేసి యతనిరాక కొమార్తెకు దెలియజేసెను.

చిరకాలమునుండి మగనిరాక కెదురు చూచుచున్న యా చిన్నది మితిలేని కుతుకము జెంది యారాత్రిఁ జక్కగా నలంకరించుకొని తదీయదర్శనం బభిలషించుచుండెను. ఇంతలో బుద్ధిసాగరుఁడు రాత్రి భోజనము చేసి కొంతసేపు మామగారితో ముచ్చటించి పిమ్మట తనపెట్టెతోగూడ నంతఃపురమున కరిగెను. ఆ సుగుణవతి తన పతి కెదురేగి పాదంబులం గడిగి శిరమునఁ జల్లుకొని తడియొత్తి సవినయంబుగాఁ గైదండ బూని శయ్యాతలము జేర్చినది.