పుట:కాశీమజిలీకథలు -01.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

పద్మావతి కథ

బుద్ధిసాగరుఁడు నిద్రఁబోక పక్షివాక్యము స్మరించుకొనుచు గామపాలుండు భార్యచేతిలో నెట్లు చచ్చునో యని యొకగవాక్షము వెంబడి లోనికిఁ దొంగిచూచుచుండెను. అప్పుడు పద్మావతి మెల్లగ లేచి తన మగఁడు గుర్రుపట్టి నిద్రబోవుట పరిశీలించి నలుదెసలు కలయజూచి బుద్ధిసాగరుఁడు తన్నుఁ జూచుచున్న విషయమెఱుఁగక నా గదిలో నొకమూలనున్న తలుపు తెరచి యాదారిని నేలసొరంగములోని కరిగినది.

అప్పుడు బుద్దిసాగరుఁడు మెల్లనలేచి యా గదిలోనికిఁబోయి దానికిఁ దెలియకుండ వెంబడించి యా సొరంగము దారినే పోవుచుండెను. అట్లు పోవఁబోవ నాదారి యొకమేదరియింటియొద్దకు వెళ్ళినది. పద్మావతియు వాని యింటి కరిగి యరుగుపై గుర్రపెట్టి నిద్రించుచున్న నామేదరిని లేపెను. దానివెంటనే వచ్చి యదియంతయు చూచుచు బుద్ధిసాగరుం డాయింట నొకమూల దాగియుండెను. ఆ నీచుఁడు కోపముతో లేచి చీ నిర్భాగ్యురాలా! యింత యాలస్యము చేసితివేల? యింతసేపు తిండితినక మేలుకొని యుండఁగల ననుకొంటివా? యని చెంపమీద నొక దెబ్బగొట్టెను. అప్పుడు పద్మావతి దవడ రాచుకొనుచు బ్రియుఁడా! కోపము సేయకుము. నే నెన్నఁడేని యింత యాలస్యము చేసితినా? కారణమున్నది వినుము. నా మగఁడైన కామపాలుఁడు బుద్ధిసాగరునితోఁ కూడ వచ్చినాఁడు. ఏకశయ్య నిరువురము బండుకొంటిమి. ఎంత యిష్టము లేకున్నను మగఁడుగదా! నిద్రపట్టువరకైన నుండవలయునా? మన పుణ్యము వలన నతఁడు రతిక్రీడకు దొరకొనకమునుపే బడలికచే నిద్రించెను. లేనిచో నా కీరాత్రియే వచ్చుటకు వీలులేకపోవును. వాని స్నేహితుఁడు బుద్ధిసాగరునికి గాలిసోకినది. అతని మూలముగాఁ గొంత యాలస్యమైనది. లేనిచోఁ బెందలకడరానా? యివిగో భక్ష్యములు భుజింపుము. నేఁడు అల్లుడు వచ్చెనని వింతగా చేసిరి. నా బుద్ధియంతయు నీమీఁదనే యుండుటచే నింతవరకు జవియైన జూడలేదు. అని పసిడిపళ్ళెరము వాని ముందర దుంచినది.

అప్పుడా మేదరవాఁ డాభక్ష్యములను మెక్కుచుఁ దరుణీ! అలాగునా! తెలియదు నిన్ను నిష్కారణముగా గొట్టితినిగదా! యీ తప్పు సై రింపుమని పలుకుచుండెను. అంత నా కాంత ప్రియుడా! నాకు నీ దెబ్బ మేమియు నొప్పిపెట్టలేదుగాని యొకటి వినుము. ఒకవేళ నా మగఁడు ననుఁ దనయూరికిఁ దీసికొని పోవునేమో యని భయమగుచున్నది. దీనికి నేనేమి చేయవలయునో తోచకున్నది. నీ వే మనియెదవని యడిగిన వాఁడిట్లనియె.

మేలు మేలు మగనితో నరిగిన నే నేమి చేయుదును? దీని కెద్దియేని ప్రతిరోధము చెప్పుము. ఇంత యేల ఇప్పు డతండు నీ యంతఃపురములోనే నిద్రించుచున్న వాడుగదా!